కేంద్రంపై సుప్రింకోర్టు సీరియస్

మూడు నూతన వ్యవసాయ చట్టాలు చేసిన కేంద్రప్రభుత్వంపై సుప్రింకోర్టు చాలా సీరియస్ అయ్యింది. మూడు చట్టాలను రద్దు చేయాలని రైతుసంఘాలు 48 రోజులుగా ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లోని సింఘూ దగ్గర పెద్దఎత్తున ఉద్యమం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఉద్యమాన్ని ఆపించటానికి కేంద్రం తరపున చిత్తశుద్దితో ఇప్పటివరకు చిత్తశుద్దితో ప్రయత్నాలు జరగలేదన్నది వాస్తవం. ఒకవైపు చట్టాలను రద్దు చేసేది లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడి చెబుతునే చట్టాల అమలుపై రైతుసంఘాలతో చర్చల కోసం కేంద్రమంత్రులను పంపుతున్నారు.

నూతన చట్టాలను రద్దు చేయాల్సిందే అని రైతులు, ఎట్టిపరిస్ధితుల్లో రద్దు చేసేది లేదని మోడి చెరోవైపు గట్టిగా కూర్చున్నారు. ఈ పరిస్దితుల్లో ఎంతమంది కేంద్రమంత్రులను ఎన్నిసార్లు చర్చలకు పంపితే మాత్రం ఏమి ఉపయోగం ఉంటుందో మోడికే తెలియాలి. ఈ విషయంలో క్లారిటి ఉండటంతోనే రైతులు సుప్రింకోర్టులో కేసు వేశారు. ఆ కేసుపైనే సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే మాట్లాడుతూ ‘నూతన చట్టాలను మీరు (కేంద్రం)నిలుపుదల చేస్తుందా లేకపోతే తామే నిలుపుదల చేయాలా’ ? అంటూ మండిపోడ్డారు.

చట్టాలను నిలుపుదల చేయటంలో కేంద్రప్రభుత్వానికి అహం ఎందుకు అడ్డువస్తోంది ? అంటూ బాబ్డే సూటిగా ప్రశ్నించారు. రైతు ఉద్యమంలో ఏదైనా జరగరానికి జరిగితే ప్రతి ఒక్కళ్ళూ బాధ్యత తీసుకోవాలని కేంద్రాన్ని హెచ్చరించటం సంచలనంగా మారింది. పైగా ఈ విషయంలో తమ చేతికి రక్తం అంటించుకోవటానికి తాము సిద్ధంగా లేమని స్పష్టంగా చెప్పింది. అంటే మొత్తం బాధ్యతంతా కేంద్రానిదే అని తేల్చేసింది. ఉద్యమంలో ఇఫ్పటికే కొందరు చనిపోయారని, మహిళలు, వృద్ధులు కూడా పాల్గొంటున్న విషయాన్ని కేంద్రం ఏ విధంగా డీల్ చేయాలని అనుకుంటోందంటూ నిలదీసింది.

చట్టాలను రద్దు చేయమని తాము చెప్పటం లేదని కాకపోతే సమస్యకు వెంటనే పరిష్కారం చూడాలని మాత్రమే తాము కేంద్రానికి సూచిస్తున్నట్లు బాబ్డే స్పష్టంగా చెప్పారు. మొత్తంమీద రైతు చట్టాలను చేయటంలో చూపించిన శ్రద్ధను ఉద్యమాన్ని హ్యాండిల్ చేయటంలో చూపలేదని నేరుగానే చెప్పేసింది. అంటే ఉద్యమాన్ని నిలుపుదల చేయటంలో కేంద్రం ఫెయిలైందని పరోక్షంగా ఎత్తిపొడిచింది. కేంద్రం తన బాధ్యతల్లో ఫెయిలైంది కాబట్టే వచ్చే సోమవారం నాటి విచారణలో తామే ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.