ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో కీలక ఎన్నికలకు తెర లేవనుంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దిశగా కూటమి సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా… వాటిని ఎదుర్కోవడంతో పాటు ఎన్నికల్లో సత్తా చాటే దిశగా వైసీపీ కూడా సమాయత్తం అవుతోంది.
అందులో భాగంగానే… గురువారం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఓ కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన సమావేశమే అయినప్పటికీ… స్థానిక సంస్థలకు సంబంధించి జగన్ ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. వెరసి స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ సీరియస్ గానే ఉన్నట్టేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డితో పాటుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, పిినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తదితర కీలక నేతలు పాలుపంచుకున్న ఈ సమావేశం సాంతం స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూరానే తిరిగింది. ఎన్నికలు ఎప్పుడు వస్తాయన్న దానిపై అంతగా స్పష్టత లేకున్నా… ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రాధాన్యమైన ఎన్నికలుగా గుర్తించాలని జగన్ సూచించారు. పార్టీ నేతలు సర్వశక్తులు ఒడ్డి మరీ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా శ్రమించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం గ్రామాల్లో అన్ని స్థాయిల నేతలు విస్తృతంగా పర్యటించాలని.. ప్రతి గ్రామంలో నిమోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సర్వసన్నద్ధం చేయడం నేతల బాధ్యతేనని కూడా జగన్ వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికలనూ సార్వత్రిక ఎన్నికల స్థాయిలోనే పరిగణించాలని, విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఆయా పార్టీలు అభ్యర్థులను బరిలోకి దించడమనే ప్రాథమిక అంశంలోనే నానా ఇబ్బందులు పడుతూ ఉంటున్న విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడైనా అదికార పార్టీల హవానే కొనసాగుతున్న వైనమూ తెలిసిందే. ఈ విషయాలను జగన్ పరోక్షంగానే అయినా తన పార్టీ శ్రేణులకు అర్థమయ్యేలా ప్రత్యేక సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దింపాల్సిందేనని చెప్పిన జగన్…ఏ ఒక్క స్థానంలోనూ పార్టీ అభ్యర్థి లేరన్న మాటే వినిపించరాదని ఒకింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా సర్ ప్రక్రియపై పూర్తి అవగాహనతో ముందుకు సాగి… అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో ఉండేలా చూసుకోవాలని సూచించారు.
ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి వారికి సీట్లు ఇవ్వాలన్న విషయాలపైనా జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అన్ని స్థాయిల కమిటీలకు వచ్చే నెల నుంచి గుర్తింపు కార్డుల జారీని ప్రారంభించనున్నామని ఆయన చెప్పారు. అదే సమయంలో పార్టీలోని వివిధ స్థాయిల్లోని కమిటీల్లో ఉత్సాహంగా కనిపించే వారిని గుర్తించాలని, వారికి మరింత కీలక బాధ్యతలు అప్పగించి ముందుకు సాగాలని… తద్వారా పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలని ఆయన సూచించారు.
వెరసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలోని ఉత్సాహవంతులకు టికెట్లు ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు రాబట్టాలని జగన్ వ్యూహం రచిస్తున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మాట అటుంచితే… అన్ని స్థానాల్లో పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపాలన్న దిశగా సాగుతున్న జగన్… ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగానే భావిస్తున్నారన్నమాట గట్టిగానే వినిపిస్తోంది.
This post was last modified on July 24, 2026 2:07 pm
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…