కేంద్ర ప్రభుత్వానికి ఇంటా బయటా కూడా.. నీట్ పరీక్షకు సంబంధించిన సెగ భారీగా తగులుతోంది. నిన్న మొన్నటి వరకు ఈ విషయాన్ని లైట్ తీసుకున్నప్పటికీ.. ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఇటు పార్లమెంటులోను.. అటు బయట కూడా నీట్ పరీక్షలో అవకతవకలు.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాలపై ప్రతిపక్షాలు ఎలుగెత్తాయి. అదేసమయంలో విద్యార్థి సంఘాలు తోడుకావడంతో కాక్రోచ్ జనతా పార్టీకి మరింత మద్దతు పెరిగింది.
వరుసగా మూడో రోజు కూడా పార్లమెంటు ఉభయ సభల్లోనూ నీట్ ప్రశ్న పత్రం లీకేజీ సహా.. కేంద్ర మంత్రి రాజీనామా, అదేసమయంలో మంగళవారం నిరసనకు దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పోలీ సుల బల ప్రయోగం వంటి కీలక అంశాలపై చర్చకు పట్టుబడుతూ.. ప్రతిపక్షాలు సభను నిలువరించే ప్రయత్నం చేశాయి. స్పీకర్ ఓం బిర్లా సభను సజావుగా నడిపించేందుకు సహకరించాలని పదే పదే విజ్ఞప్తి చేసినా.. ప్రతిపక్షాలు ఆయా అంశాలపైనే చర్చకు పట్టుబట్టాయి. దీంతో ఉభయ సభలు ఇలా ప్రారంభమై .. అలా వాయిదా పడ్డాయి.
నల్ల దుస్తులతో..
మరోవైపు కాంగ్రెస్ పార్టీ సహా.. ప్రతిపక్ష సభ్యులు నల్ల దస్తుల్లో పార్లమెంటుకు వచ్చారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారని, నిరసన తెలిపిన వారిపై లాఠీలతో విరుచుకుపడుతున్నారని పేర్కొంటూ.. కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. నల్లదుస్తుల్లోనే సభకు వచ్చారు. మహిళలు, పురుష సభ్యులు కూడా నల్లదుస్తుల్లోనే సభకు రావడంతో అధికార పక్ష సభ్యులు డోలాయమానంలో పడ్డారు. తొలిసారి దేశ చరిత్రలో పార్లమెంటుకు నల్లదుస్తుల్లో రావడంపై చర్చ జరగడం గమనార్హం.
ఇక, బయట కూడా ఇదే పరిస్థితి నెలకొంది.. కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తన నిరసనలను కొనసాగిస్తున్నారు. శాంతియుత పంథాలో గాంధేయ మార్గంలో నిరసనను కొనసాగిస్తున్నారు. కొందరు యువకులు నిరసన ప్రాంతంలోనే గత రాత్రి నిద్రపోయి.. ఉదయం వీధులు ఊడ్చారు. మరికొందరు.. చెట్లకు నీళ్లు పోసి నిరసన వ్యక్తం చేశారు. ఇలా.. పలు మార్గాలలో బయట కూడా.. నిరసన వ్యక్తం కావడంతో కేంద్ర సర్కారుకు సెగ భారీగానే తగులుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
