కేంద్ర ప్రభుత్వం చాలా గొప్ప ఆవిష్కరణగా ప్రమోట్ చేసుకుంటున్న ఈ-20 పెట్రోల్ విషయంలో వినియోగదారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ పెట్రోల్ వినియోగంతో మైలేజీ దారుణంగా పడిపోయిందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోలు జనాలను కంగారు పెట్టిస్తున్నాయి.
ఐతే కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో ప్రముఖులు ఎవరూ దీని గురించి ఓపెన్గా మాట్లాడట్లేదు. ఇలాంటి టైంలో టాలీవుడ్ సీనియర్ నటుడు విజయకృష్ణ నరేష్.. ఈ20 పెట్రోల్ మీద విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం హాట్ టాపిక్2గా మారింది. రూ.2 కోట్ల పోర్షే కారు యజమానిగా తనకు ఈ-20 పెట్రోల్ గుండెపోటు తెప్పించిందని ఆయన కుండబద్దలు కొట్టేశారు.
‘‘నేను యాంటి నేషనల్ కాదు.. కానీ ఈ ఇథనాల్ పెట్రోల్ బైక్ వినియోగదారులతో పాటు హై ఎండ్ కార్ వినియోగదారులకు గుండెపోటు తెప్పిస్తోంది. బీజేపీ మద్దతుదారే అయిన నా స్నేహితుడు ఇథనాల్ పెట్రోల్ వాడడం వల్ల తన టయోటా కారు వాల్వులను మార్చాల్సి వచ్చింది. అందుకు రూ.3.5 లక్షలు ఖర్చయింది. నా పోర్షే కారుకు వాల్వులు మార్చాల్సి వస్తే 12 లక్షల దాకా ఖర్చవుతుంది. ఈ20 పెట్రోల్ వాడడం వల్ల ఇప్పుడు నేను లీటరు రూ.165 ధర ఉన్న హై ఆక్టేన్ పెట్రోల్కు మారాల్సి వచ్చింది. మరి బైక్ వినియోగదారులు, ఇతరుల పరిస్థితి ఏంటి? వారికిది పీడకలనే మిగులుస్తుంది’’ అని నరేష్ వ్యాఖ్యానించారు.
తాను బీజేపీ మాజీ నాయకుడని ఈ సందర్భంగా గుర్తు చేసిన నరేష్.. పర్యావరణ హితం కోసం ఈ-20 పెట్రోల్ను తీసుకురావడం తొందరపాటు నిర్ణయంగా కనిపిస్తోందని, ఇది కోట్లమంది జనాలకు ఇబ్బంది కలిగిస్తోందని, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని బీజేపీ నాయకులకు సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
