ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య తలెత్తకుండా పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోస్తూ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం సమర్థంగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి, ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదికి నీటి ప్రవాహం క్షీణించడంతో కృష్ణా డెల్టా సాగుపై అనిశ్చితి నెలకొంది. పులిచింతల జలాశయంలో ఉన్న 32 టీఎంసీల నీరు మాత్రమే లక్షల ఎకరాల ఆయకట్టుకు సరిపోని పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా 2015లో ప్రారంభించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం రైతులకు ఆధారంగా మారింది.
ఇదే విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటిపారుదల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తోందని, సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటిని సద్వినియోగం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోందని కేటీఆర్ కితాబిచ్చారు..అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు.
నీటిపారుదల రంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనే విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates