చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌` గుర్తింపు ఇచ్చింది. `అల్లూరి సీతారామ‌రాజు` అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంగా పేరు నిర్ధారించిన ఈ విమానాశ్ర‌యాన్ని.. ఇమ్మిగ్రేష‌న్ అండ్ ఫారిన్ యాక్ట్‌-2025లో చేర్చింది. త‌ద్వారా.. ఈ విమానాశ్ర‌యం అంత‌ర్జాతీయ కేట‌గిరీలో తొలిస్థానం ద‌క్కించుకున్న‌ట్టు అయింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేయ‌డంతోపాటు గెజిట్ ప్ర‌క‌ట‌న చేసింది.

దేశవ్యాప్తంగా ఎన్నో విమానాశ్ర‌యాలు ఉన్న‌ప్ప‌టికీ.. కొన్నింటికి మాత్ర‌మే అంత‌ర్జాతీయ ముఖ్యంగా `ఇమ్మిగ్రేష‌న్` గుర్తింపు ల‌భిస్తుంది. దీనివ‌ల్ల కేంద్రం నుంచిప్ర‌త్యేకంగా నిధులు అంద‌డంతోపాటు.. స‌మీప ప్రాంతాల‌ను కూడా మ‌రింత ఎక్కువ‌గా అభివృద్ధి చేయ‌నున్నారు. అలాగే.. అంత‌ర్జాతీయ స్థాయి విమానాలు రాక‌పోక‌లు సాగిస్తాయి. త‌ద్వారా.. స్థానికంగా వ్యాపారాలు, వాణిజ్యం వంటివి జోరుగా పుంజుకోనున్నాయి. అంతేకాదు.. అంత‌ర్జాతీయంగా ప‌లు దేశాల‌కు చెందిన‌ విమానాశ్రయాల జాబితాలో భోగాపురం పేరు క‌నిపించ‌నుంది.

ఎప్పుడు ప్రారంభం..?

జీఎంఆర్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న భోగాపురం విమానాశ్ర‌యం పూర్తి అయింది. గ‌త ఏప్రిల్ లోనే తొలి విమాన ట్ర‌య‌ల్ ర‌న్‌నుకూడా చేప‌ట్టారు. ఇక‌, చిన్న‌పాటి ప్యాచ్‌వ‌ర్క్స్ కూడా ఇటీవ‌ల పూర్త‌య్యాయి. అయితే.. ఈ విమానాశ్ర‌యాన్ని ప్ర‌ధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించి జాతికి అంకితం చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. పైగా కూట‌మిలోనూ భాగ‌స్వామ్య ప‌క్షంగా ఉన్న నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాన్ని మోడీ ప్రారంభిస్తేనే బాగుంటుంద‌ని అంచ‌నా వేసుకున్నారు.

కానీ, ప్ర‌స్తుతం మోడీ షెడ్యూల్ అందుబాటులోకి రాక‌పోవ‌డంతో .. ఈ విమానాశ్ర‌యం ప్రారంభించే విష‌యంపై క్లారిటీ లేకుండా పోయింది. వ‌చ్చే నెల చివ‌రిలో దీనిని ప్రారంభించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ నెల 20 నుంచి పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవి వ‌చ్చే నెల 13వ తేదీవ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. అనంత‌రం.. పంద్రాగ‌స్టు వేడుక‌లు ఉంటాయి. అవి పూర్త‌య్యాక కానీ, ప్ర‌ధానికి తీరుబడి ఉండ‌ద‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆగ‌స్టు నెలాఖ‌రు నాటికి భోగాపురం అందుబాటులోకి రానుంది.