బీఆర్ఎస్ `బ్లెడ్` పాలిటిక్స్‌.. ఇంత అవ‌స‌ర‌మా?

తెలంగాణ‌లో రైతుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ముందుకు రావ‌డం లేద‌ని, ప్రాజెక్టుల‌కు నీటిని విడుద‌ల చేయ‌డం లేద‌ని ఆరోపిస్తూ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ పార్టీ బ్లెడ్ పాలిటిక్స్‌(ర‌క్త రాజ‌కీయం) కు తెర‌దీసింది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైతుల ర‌క్తం చ‌విచూస్తున్నార‌ని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌.. సీఎంకు కావాలంటే త‌మ ర‌క్తం ఇస్తామ‌ని, రైతుల‌ను ఆదుకోవాల‌ని ఆదివారం ఎక్స్ వేదిక‌గా కామెంట్లు చేశారు.

అనంత‌రం.. సోమ‌వారం జూబ్లీహిల్స్‌లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాల‌యంలో ఆ పార్టీ విద్యార్థి, యువ‌జ‌న విభాగం కార్య‌క‌ర్త‌లు ర‌క్త‌దాన శిబిరాలు నిర్వ‌హించారు. ఈ శిబిరాల్లో ప‌లువురు విద్యార్థులు ర‌క్తం దానం చేశారు. అనంత‌రం.. ఈ ర‌క్తాన్ని స‌చివాల‌యానికి తీసుకువెళ్లి.. సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చి.. నిర‌స‌న తెల‌పాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో పోలీసులు బీఆర్ ఎస్ విద్యార్థి, యువజ‌న విభాగం కార్య‌క‌ర్త‌ల‌ను అడ్డుకుని ర‌క్తం బాటిళ్లు, ప్యాకెట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ఇరు ప‌క్షాల మ‌ధ్య తీవ్ర వాగ్యుద్ధం న‌డిచింది. అయిన‌ప్ప‌టికీ.. పోలీసులు మ‌రింత మందిని రంగంలోకి దింపి బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ను అడ్డుకున్నారు. ఇదిలావుంటే.. అస‌లు ఇంత రాజ‌కీయం అవ‌స‌ర‌మా? అనేది ప‌రిశీల‌కుల మాట‌. రైతుల‌ను ఆదుకునే విష‌యంలో గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం కూడా వెనుక‌బ‌డే ఉంద‌ని ప‌లువురు గుర్తు చేస్తున్నారు. రాజ‌కీయం చేసేందుకు అనేక అంశాలు ఉన్నాయ‌ని రైతుల‌కు నీటిని విడుద‌ల చేయ‌క‌పోతే.. ఆ మేర‌కు మ‌రో మార్గం ఎంచుకోవాల‌ని చెబుతున్నారు.

ఇక‌, బీఆర్ఎస్ బ్లెడ్ పాలిటిక్స్‌పై కాంగ్రెస్ తీవ్రంగా మండిప‌డింది. గ‌తంలో బీఆర్ఎస్ పాల‌కులు రైతుల‌కు సంకెళ్లు వేసి జైలుకు త‌ర‌లించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డం గ‌మ‌నార్హం. న‌ల్గొండ‌, మ‌హ‌బూబాబాద్ వంటి జిల్లాల్లో రైతులు.. గిట్టుబాటు ధ‌ర కోసం రోడ్డెక్కితే లాఠీల‌తో ఎలా కొట్టించారో చూడండి.. అంటూ.. నాటి ఫొటోల‌ను పోస్టు చేశారు. అంతేకాదు.. రైతుల‌పై నాడు మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం.  మొత్తంగా బీఆర్ ఎస్ బ్లెడ్ పాలిటిక్స్ ఎవ‌రికి మేలు చేస్తాయో చూడాలి.