ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎప్పుడెలా మారిపోతుందో తెలియక జనాలే కాదు.. ఆ పార్టీ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారు. ముందేమో అమరావతిని రాజధానిగా స్వాగతిస్తున్నాం, 30 వేల ఎకరాలకు తగ్గకుండా రాజధాని ఉండాాలని అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు ఆ పార్టీ అధినేత జగన్. కానీ అధికారంలోకి రాగానే వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు. తర్వాత ఒక దశలో రాజధాని అనే మాటే రాజ్యాంగంలో లేదంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.
ఆపై విశాఖపట్నమే రాజధాని అని పేర్కొన్నారు. ఇన్నిసార్లు మాట మార్చడంతో రాజధాని అంశం 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ఒక ప్రధాన కారణంగా మారింది. తర్వాత అయినా వైసీపీ తప్పు సరిదిద్దుకుని అమరావతికి అనుకూలంగా మారుతుందేమో అని ఆశించారందరూ. ఆ పార్టీ నేతలు కొందరి మాటలు చూస్తే వైసీపీలో మార్పు మొదలైనట్లే కనిపించింది. కానీ అనూహ్యంగా జగన్ ‘మావిగన్’ అంటూ రాజధానిగా కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
దీనికి వచ్చిన స్పందన చూస్తే.. జగన్ మరోసారి ఎంత పెద్ద తప్పు చేశారో అర్థమై ఉండాలి. కానీ జగన్ ఫీడ్ బ్యాక్ అంటూ తీసుకోరా.. లేదంటే ఆయనకు రాంగ్ ఫీడ్ బ్యాక్ వస్తుందా అన్నది అర్థం కావడం లేదు కానీ.. 2029 ఎన్నికలు ‘అమరావతి వెర్సస్ మావిగన్’ అంశం మీద నడుస్తాయంటూ ఇంకో భారీ స్టేట్మెంట్ ఇచ్చి అందరినీ విస్మయానికి గురి చేశారు. రాజకీయాల్లో అందరు నాయకులూ తప్పులు చేస్తారు. కానీ తాము చేసింది తప్పు అని తెలిశాక నేరుగా ఆ విషయం ఒప్పుకోకపోయినా.. తమ చర్యల ద్వారా పశ్చాత్తాప భావన వ్యక్తం చేయడం, సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించడం జరుగుతుంటుంది.
కానీ జగన్ తీరు మాత్రం వేరు. రాజధాని అంశంతో ఆటలు ఆడడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని అర్థమవుతున్నా.. మళ్లీ చెలగాటానికి జగన్ ఎందుకు సిద్ధమవుతున్నాడా అని వైసీపీ నేతలు, కార్యకర్తలే తలలు పట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. జగన్కు ఎందుకింత ఇగో అనే చర్చ జరుగుతోంది. రాజధాని విషయంలో అసలు ఆయన లక్ష్యమేంటి అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఐతే జగన్ మనస్తత్వం తెలిసిన వాళ్లు ఈ విషయంలో ఒక ఆసక్తికర వాదన చేస్తున్నారు.
ఎవరెంత చెప్పినా అమరావతి విషయంలో జగన్ వ్యతిరేకత తగ్గేది కాదని.. ఒకవేళ అమరావతికి అనుకూలంగా మారినా తనకు ఒనగూరేది ఏమీ లేదని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. రాజధాని విషయంలో వేసిన కుప్పిగెంతుల వల్ల అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాగూ తమ పరిస్థితి మెరుగుపడదని.. అమరావతి వ్యతిరేకిగా జనాల్లో ఎలాగూ ముద్ర పడిపోయిందని.. అలాంటపుడు ఇప్పుడు రాజధానికి మద్దతుగా నిలబడడం వల్ల తమకు కొత్తగా చేకూరే ప్రయోజనం లేదని జగన్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
అమరావతిని దెబ్బ తీస్తూ ఉండడం ద్వారా.. అక్కడ కూటమి ప్రభుత్వం అనుకున్న లక్ష్యం సాధించకుండా చేయడమే జగన్ లక్ష్యంగా పేర్కొంటున్నారు. అక్కడ ఎంత డబ్బులు పెట్టి బిల్డింగులు కట్టినా, రోడ్లు వేసినా, ఇతర మౌళిక సదుపాాయాలు కల్పించినా.. ప్రైవేటు వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా అక్కడికి పెద్ద ఎత్తున కదిలి రావడం, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం, సహజంగా వ్యాపారాలు వృద్ధి చెందడం, జనాభా పెరగడం ద్వారానే అమరావతి అభివృద్ధి సాధ్యమని.. తన ప్రకటనల ద్వారా ప్రైవేటు వ్యాపారవేత్తలు, పెట్టుబడి దారుల్లో నిరంతరం ఒక భయం నెలకొల్పి వారిని నిరుత్సాహపరచడం జగన్ ఉద్దేశంగా కనిపిస్తోంది.
తద్వారా అమరావతిని ఎదగనీయకుండా చేయడమే జగన్ లక్ష్యమని.. తద్వారా చంద్రబాబు ఏరికోరి ఎంచుకున్న రాజధానిలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది, ఇక్కడ పెడుతున్న వేల కోట్ల పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరే అని జనాలను నమ్మించే ప్రయత్నం చేయడమే ఆయన ఉద్దేశమని అంటున్నారు. ఐతే జగన్ గేమ్ ఏంటో బాబు అండ్ కోకు అర్థం కాకుండా ఉండదు కాబట్టి.. జగన్కు ఛాన్సివ్వకుండా అమరావతిలో అభివృద్ధితో పాటు యాక్టివిటీ కూడా పెంచి 2029 ఎన్నికలకు వెళ్తే వైసీపీని మరోసారి గట్టి దెబ్బ తీయడానికి అవకాశముంటుంది.
This post was last modified on July 3, 2026 11:41 am
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…