వైసీపీ అధినేత జగన్ చేసిన మావిగన్ ప్రకటన దరిమిలా.. అమరావతిపై మరింత ఆసక్తి పెరిగింది. గూగుల్లో అమరావతి రాజధానిపై బుధవారం సాయంత్రం వరకు లక్షల సంఖ్యలో పరిశోధించారు. అసలు రాజధాని విస్తీర్ణం ఎంత? గతంలో ఇచ్చిన కమిటీ నివేదిక, రాష్ట్ర విభజన తర్వాత రాజధాని కోసం జరిగిన పరిణామాలు.. ఇలా అనేక విషయాలపై ప్రజలు ఆసక్తి చూపించారు. ఇదొక్కటే కాదు.. జగన్ చేసిన మావిగన్ ప్రకటన గురించి కూడా ఆరా తీయడం గమనార్హం. ఈ నేపథ్యంలో మావిగన్ వర్సెస్ అమరావతి తేడాలపైనా పలువురు చర్చించడం గమనార్హం.
ఇవీ ప్రధాన తేడాలు..
* జగన్ చెబుతున్న మావిగన్.. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను అభివృద్ధి చేసి.. రాజధానిగా ప్రకటించడం.
చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం కొత్తగా మహానగరాన్ని నిర్మించడం.
*మావిగన్ అంటే.. ఉన్న ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసి.. దానినే రాజధానిగా చూపించే ప్రయత్నం. తద్వారా.. కొత్తగా భూముల సమీకరణ ఉండదు. కొత్తగా నిర్మాణాలు కూడా పెద్దగా ఉండవు.
*ప్రస్తుతం జరుగుతున్న అమరావతితో కొత్తగా నవ నగరాలు ఏర్పడనున్నాయి. తద్వారా.. అధునాతన సౌకర్యాలతో కూడిన వసతులు ఏర్పడనున్నాయి.
* అంతేకాదు.. కొత్తగా ఏర్పాటయ్యే అమరావతిలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.
* విదేశాల నుంచి కూడా పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
*మావిగన్ అంటే.. కొత్తగా వచ్చే పెట్టుబడులకు ఎలాంటి అవకాశం లేదు. ఉన్నవాటినే అడ్జస్ట్ చేసుకోవాలి.
*ప్రాంతం విస్తీర్ణం కూడా పెరగదు. అదే సమయంలో ఉన్న ప్రాంతంలోనే అన్నీ అంటే.. ట్రాఫిక్ నుంచి మౌలిక సదుపాయాల వరకు ఇబ్బందులు ఏర్పడతాయి.
*మావిగన్కు.. అమరావతికి ఖర్చులో తేడా ఉంటుందని అంటున్నారు.
* అమరావతికి కేంద్రం ఇచ్చే నిధులు మావిగన్కు వచ్చే అవకాశం లేదు.
* కొత్త రాజధానికి మాత్రమే నిధులు ఇవ్వాలని విభజన చట్టంలో ఉంది. అయితే.. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో కూడా వెనుకడుగు వేస్తోంది. ఇక.. మావిగన్ అంటే.. అసలు ఆ ఊసే ఎత్తదు.
సాధ్యమేనా?
ఇక.. జగన్ చెబుతున్న మావిగన్ సాధ్యమేనా? అంటే.. కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పార్లమెంటు, అసెంబ్లీలు అమరావతి రాజధానికి అనుగుణంగా తీర్మానాలు ఆమోదించాయి. రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడింది. మరోసారి మావిగన్ను రాజధానిగా గుర్తించాలంటే.. ఇదే క్రతువు జరగాల్సి ఉంది. కానీ, ఇది సాధ్యం కావాలంటే.. పార్లమెంటులో మళ్లీ ఆమోదం పొందాలి. దీనికి కేంద్రం సహకరించే అవకాశం లేదు. పైగా దేశంలోని మెజారిటీ పార్టీలు.. అమరావతిని రాజధానిగా గుర్తించాయి. ఈ నేపథ్యంలో జగన్ చేసిన మావిగన్ ప్రకటన ప్రయాసగానే మారుతుందని మెజారిటీ ప్రజలు సైతం అభిప్రాయపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
