దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో లేని రీతిలో ఏపీలో మాత్రమే రసవత్తర రాజకీయం నడుస్తోంది. ఎన్నికలు ముగిసి రెండేళ్లు అవుతున్నా… మలి ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నా… ఏపీలో నిత్యం సరికొత్త రాజకీయమే నడుస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులతో పాటు శాశ్వత శత్రువులు కూడా ఉండరన్న మాట ఏపీ రాజకీయాల్లోనూ గట్టిగా వినిపిస్తోంది. ఈ మాట అక్కడ వినిపించడమే కాదండోయ్… స్పష్టంగా కనిపిస్తోంది కూడా. మొన్నటిదాకా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ తాజాగా తన వైఖరిని మార్చేశారు. ఫలితంగా వైసీపీకి ఉన్న ఓటు బ్యాంకుకు గండి తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
దళిత సామాజిక వర్గానికి చెందిన జడ శ్రావణ్… ఆదిలో దళితులు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే దళితులకు సంబందించి ఏ అంశం తెర మీదకు వచ్చినా.. ఆయన ఓ రేంజిలో ఫైరయ్యేవారు. ఆ క్రమంలోనే ఆయన ఏపీలోని అదికార కూటమికి ప్రత్యర్థిగా మారిపోయారు. కూటమి సర్కారు తీసుకునే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన విమర్శించేవారు. తాజాగా ఓ సమావేశంలో జడ శ్రావణ్ చేసిన వ్యాఖ్యలను చూస్తే… వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన వ్యతిరేకిగా మారిపోయారని చెప్పక తప్పదు.
2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపులో దళిత క్రిస్టియన్లు కీలక భూమిక పోషించిన విషయాన్ని ప్రస్తావించిన జడ శ్రావణ్… ఆ తర్వాత అదికారంలోకి వచ్చిన జగన్ ఆ వర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. అంతేకాకుండా జగన్ మాట విని వైసీపీకి ఓటేసిన, ఓట్లు వేయించిన క్రిస్టియన్ మత గురువుల తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. జగన్ చెప్పంగానే బరిలోకి దిగి దళిత క్రిస్టియన్ల ఓట్లను గంపగుత్తగా వైసీపీకి వేయించిన పాస్టర్లకు ఇప్పుడు తగిన రీతిలో గుణపాఠం తప్పడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ మాట విన్నందుకు పాస్టర్లకు తగిన శాస్తి జరిగిందని ఆయన అన్నారు.
జడ శ్రావణ్ చేసిన వ్యాఖ్యలు విన్నవారంతా ఆయన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు కదా అనే వ్యాఖ్యానిస్తున్నారు. దళిత క్రిస్టియన్ల ఓట్లతో సీఎం పీఠాన్ని దక్కించుకున్న జగన్… వారికి కించిత్ సాయం కూడా చేయలేదని వారు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే వారు వైసీపీ హయాంలో మరణించిన డాక్టర్ సుధాకర్, ఎరిచర్ల కిరణ్ కుమార్ ఘటనలను ప్రస్తావిస్తున్నారు. వీరిద్దరూ దళిత క్రిస్టియన్లు అయినప్పటికీ.. జగన్ హయాంలో వారిద్దరిపై జగన్ అండ్ కో ఏదో పగబట్టినట్టుగా వ్యవహరించిన తీరును వారు గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో ఈ రెండు ఘటనలను కూడా జడ శ్రావణ్ ప్రస్తావించాలని, వారి కుటుంబాలకు న్యాయం జరిగే దిశగా ఆయన పోరాటం చేయాల్సి ఉందన్న వాదనలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి.
జడ శ్రావణ్ తాజా వైఖరి నేపథ్యంలో ఏపీలోకి దళిత క్రిస్టియన్ ఓటు బ్యాంకు పూర్తిగా కాకున్నా.. ఓ మోస్తరుగా చీలిపోవడం ఖాయమేనన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. జగన్ బలమంతా దళిత క్రిస్టియన్ ఓటు బ్యాంకేనన్న సంగతి తెలిసిందే. వైసీపీకి పెట్టని కోటగా ఉన్న సదరు ఓటు బ్యాంకుకు బీటలు వారితే ఇక జగన్ పరిస్థితి అంతే అన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. మొత్తంగా జడ శ్రావణ్ వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో ఓ రేంజిలో ఆందోళనను పుట్టించాయని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates