ప్రశ్నిస్తే NTRని కూడా రౌడీ షీటర్ అంటారు: జగన్

రాష్ట్రంలోని కూట‌మి స‌ర్కారుపై వైసీపీ అధినేత జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌శ్నించిన వారి గ‌ళం నొక్కుతున్నార‌ని.. వారి రౌడీషీట‌ర్ అనే ముద్ర వేస్తున్నార‌ని ఆరోపించారు. దివంగ‌త ఎన్టీఆర్ జీవించి ఉంటే.. ఆయ‌న కూడా ఈ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించేవార‌ని, అప్పుడు ఆయ‌న‌పైనా రౌడీషీట‌ర్ అనే ముద్ర వేస్తారా? అని ప్ర‌శ్నించారు. ఒక‌ప్పుడు బీహార్‌ను జంగిల్ రాజ్ అనేవార‌ని.. ఇప్పుడు ఏపీనే జంగిల్‌రాజ్‌గా మారింద‌ని విమ‌ర్శించారు.

చంద్ర‌బాబు పాల‌న‌లో జంగిల్ రాజ్‌, రెడ్ బుక్ ప‌రిపాల‌న జ‌రుగుతోంద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. గ‌త 18 నెల‌లుగా వ‌రుస అరాచకాల‌కు పాల్ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. రాజ‌ధాని రైతుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన వైసీపీ నాయ‌కులు అంద‌రూ రౌడీషీట‌ర్లేనా? అని ప్ర‌శ్నించారు. బుధ‌వారం తాడేప‌ల్లిలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బాబు ప‌రిపాల‌న‌లో బాధితులే నిందితులుగా మారుతార‌ని వ్యాఖ్యానించారు.

రాజ‌ధాని రైతుల‌ను బాగా చూసుకుంటున్నామ‌ని చెబుతున్న చంద్ర‌బాబు.. వారు ప‌డుతున్న క‌ష్టాల‌ను ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. బాబు ప‌ట్టించుకుని.. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించి ఉంటే.. త‌న వ‌ర‌కు వ‌చ్చి ఉండేవారు కాద‌న్నారు. రైతులు వ‌చ్చి త‌న‌కు వారి స‌మ‌స్య‌లుచెప్పుకొన్నార‌ని.. ఆ త‌ర్వాతే వైసీపీ టీం వారికి అనుకూలంగా ప‌రామ‌ర్శించేందుకు అమ‌రావ‌తిలోకి వెళ్లే ప్ర‌య‌త్నం చేశార‌ని.. కానీ, వారిపై టీడీపీ కార్య‌క‌ర్త‌లు దాడులు చేశార‌ని తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌లో అడ్డు త‌గిలి, దాడి చేసింది టీడీపీ వాళ్లు. కానీ, పోలీసులు మాత్రం మావాళ్ల‌పై కేసులు పెట్టారు. ఇదీ.. చంద్ర‌బాబు జంగిల్ రాజ్ ప‌రిపాల‌న‌. అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. రైతుల కోసం న్యాయ పోరాటం చేస్తామ‌న్నారు. వారికి త‌మ లీగ‌ల్ టీం అన్ని విధాలా సాయం చేస్తుంద‌ని అన్నారు. వైసీపీ మాజీ మంత్రులు, నాయ‌కులను రౌడీషీట‌ర్లుగా ప్రొజెక్టు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. రాజ‌ధానికి తాను వ్య‌తిరేకంత కాద‌ని జ‌గ‌న్ చెప్పారు. అయితే.. అక్క‌డ జ‌రుగుతున్న దోపిడీకే తాను వ్య‌తిరేక‌మ‌న్నారు. అందుకే.. మావిగ‌న్ రాజ‌ధానికే తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్నారు.