ఏపీలో ఎప్పటికప్పుడు రాజకీయం వేడెక్కిపోతోంది. వాటన్నింటినీ తలదన్నేలా బుధవారం ఓ కీలక అంశం రంగంలోకి దిగింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండగానే…ఆ ఎన్నికల్లో తమ అజెండా ఇదేనంటూ వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సంచలన ప్రకటన చేశారు.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఎజెండా మావిగనే అని ఆయన కుండబద్దలు కొట్టారు. మావిగన్ కు మద్దతు పలికే వారే తమ పార్టీకి ఓటేస్తారని కూడా ఆయన కీలక ప్రకటన చేశారు. వెరసి ఇక రానున్న మూడేళ్లంతా మావిగన్ వర్సెస్ అమరావతి అనే విషయంపైనే ఏపీ రాజకీయం నడుస్తుందని చెప్పాలి.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు స్పందించిన జగన్.. మావిగన్ ప్రస్తావన తీసుకొచ్చారు. అవినీతి రహిత రాజధాని నిర్మాణమే తమ నినాదమన్న జగన్.. ఈ కారణంగానే తాము అమరావతిని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. మావిగన్ ను రాజధానిగా పరిగణిస్తే.. ఎలాంటి అవినీతి లేకుండానే రాజధాని నిర్మాణాన్ని చేపట్టవచ్చని ఆయన చెప్పుకొచ్చారు.
మావిగన్ లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయన్న జగన్… మావిగన్ ను రాజధానిగా అభివృద్ది చేయాలంటే పెద్దగా నిధులు కూడా అవసరం లేదని, ఈ కారణంగానే తాము మావిగన్ ను ప్రతిపాదించామన్నారు. మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం, గుంటూరులో వివిధ విద్యా సంస్థలు ఉన్నాయని, ఓ రాజధానికి ఇంతకంటే ఏం కావాలని కూడా ఆయన ప్రశ్నించారు.
ఇక మావిగన్ ఎజెండాతోనే తాము వచ్చే ఎన్నికలకు వెళతామన్న జగన్.. తమ నినాదం నచ్చివవారే వైసీపీకి ఓటేస్తారని ఓ సంచలన వ్యాఖ్య చేశారు. అదే సమయంలో అమరావతికి మద్దతు ఇచ్చేవారంతా కూటమి పార్టీలకు ఓటేస్తారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ తరహాలో ఓటింగ్ జరిగినా..తమకేమీ ఇబ్బంది లేదన్న ధీమాను జగన్ వ్యక్తపరిచారు.
ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి ప్రాతిపదికనే ఎన్నికలు జరగనున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. తాను రైతుల పక్షపాతిగా చెప్పుకున్న జగన్.. అమరావతిలో రాజధాని నిర్మాణం పేరిట రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. అలాంటి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత తనకు లేదా? అని కూడా ఆయన ప్రశ్నించారు. మొత్తంగా మావిగన్ వర్సెస్ అమరావతి పేరిట జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకే తెర లేపాయని చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates