ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల కాలంలో చిన్న చిన్న ఘటనలపై కూడా చాలా సెన్సిటివ్గా స్పందిస్తున్నారు. ఆయా ఘటనలపై తన ఆవేదన వ్యక్తం చేయడంతోపాటు.. బాధితులకు అండగా కూడా నిలుస్తున్నారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారి వీడియో తన దృష్టికి వస్తే.. వెంటనే స్పందిస్తున్నారు. ఆయా కుటుంబాలకు అండగా ఉంటున్నారు. అలానే ఇటీవల హోర్ముజ్ జలసంధిలో విశాఖకు చెందిన నేవీ ఉద్యోగి అమెరికా సైన్యం జరిపిన దాడిలో మృతి చెందిన విషయం సోషల్ మీడియాలో రాగానే వెంటనే బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. వెంటనే అందుబాటులో ఉన్న మంత్రులను ఆయన కుటుంబం వద్దకు కూడా పంపించారు.
ఇలా విషయం ఏదైనా కూడా చంద్రబాబు తన దృష్టికి వస్తే.. గతంలో మాదిరిగా అధికారులకు చెప్పి ఊరుకోకుండా తానే రంగంలోకి దిగుతున్నారు. తాజాగా మంగళవారం రెండు ఘటనలపై చంద్రబాబు ఇలానే స్పందించారు. చాలా సెన్సిటివ్గా ఆయన స్పందించిన తీరు బాధితులకు భారీ ఓదార్పును ఇచ్చింది. వీటిలో ఒకటి.. తుంగభద్ర నదిలో పడి రెండు ఎద్దులు మృతి చెందిన ఘటన. వాస్తవానికి ఇలాంటి ప్రమాదాల విషయంలో అధికారులకు చెప్పి ఊరుకోవచ్చు. కానీ, సీఎం స్వయంగా వాటిపై స్పందించారు. వెంటనే తన సోషల్ మీడియాలో వీడియోను పంచుకున్నారు. తాను ఎంతో బాధపడుతున్నానని తెలిపారు.
పశువులను సంపదగా భావిస్తాం. రైతన్నకు వెన్నుదన్నుగా ఉండేవి కాడెద్దులు. కుటుంబ సభ్యుల్లా భావించే రెండు ఎద్దులు తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తూ చనిపోవడం ఎంతో బాధ కలిగించింది. అన్నదాతకు పవిత్రమైన రోజైన ఏరువాక పౌర్ణమి నాడు ఇవి మృతి చెందడం, ఆ యజమాని కుటుంబం ఆవేదనతో విలపించడం నన్నెంతో కలిచివేసింది. ఎడ్లు లేని లోటు పూడ్చలేనిదైనప్పటికీ…వాటి యజమాని అయిన కర్నూలు జిల్లా మంచాలకు చెందిన కురవ సురేష్ కుటుంబానికి ప్రభుత్వం తరపున పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఇప్పటికే ఆదేశించాను. ప్రాణంలా చూసుకునే ఎడ్లను కోల్పోయిన ఆ కుటుంబానికి కొంత సాయంగా నిలవాలని సూచించాను. అని బాబు పేర్కొన్నారు.
మరో ఘటనలోనూ చంద్రబాబు ఇలానే స్పందించారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్ కార్యకర్త సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. ఈ ఘటన జరిగి రెండు రోజులైంది. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం మంగళవారం సీఎం చంద్రబాబు పేపర్లో చదివి తెలుసుకున్నారు. వెంటనే సత్యనారాయణ కుటుంబానికి ఫోన్ చేసి వారికి ధైర్యం చెప్పారు. పార్టీ సహా తాను కూడా అండగా ఉంటామని తెలిపారు. అప్పటికప్పుడు ఆసుపత్రి ఖర్చుల కింద 2 లక్షల రూపాయలను పంపిస్తున్నట్టు చెప్పారు. ఇలా.. విషయం చిన్నదే అయినా.. చంద్రబాబు సెన్సిటివ్గా స్పందించడం గమనార్హం. ఇది బాధిత కుటుంబాలకు ఎంతో భరోసా ఇస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates