‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు వ‌చ్చింద‌ని నేను అనుకుంటున్నా. ఆ పార్టీని ప్ర‌జ‌లు ఎప్పుడో ప‌క్క‌న పెట్టేశారు. ఇప్పుడు ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే పార్టీలు, రాష్ట్రం కోసం ప‌నిచేసే నాయ‌కులు ఉన్నారు. వ్య‌క్తిగ‌త స్వార్థం కోసం.. ప‌నిచేసేవారు ఎవ‌రూ లేరు. రాజ‌కీయాలు మ‌రీ అంత చెడిపోలేదు. చెడ్డ‌వి కూడా కావు. రండి. రాజ‌కీయ పార్టీల్లో చేరండి. అని మంత్రి నారా లోకేష్ యువ‌త‌కు పిలుపునిచ్చారు.

ముఖ్యంగా ఇంట‌ర్‌, డిగ్రీ త‌ర్వాత యువ‌త ఐఏఎస్‌, ఐపీఎస్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. ఇది మంచిదేన‌ని, అదేస‌మ‌యంలో యువ‌త రాజ‌కీయాల‌పైనా దృష్టి పెట్టాల‌ని లోకేష్ సూచించారు. రాజ‌కీయాల్లో ఉంటే మ‌రింత‌గా ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు. అంతేకాదు ప్ర‌భుత్వంలో ఉంటే.. స‌ద‌రు నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు ఆమోద‌యోగ్య‌మైన‌, అభివృద్ధిక‌రమైన నిర్ణ‌యాలు తీసుకుంటే అది యావ‌త్ రాష్ట్రానికి, త‌ర్వాత దేశానికి కూడా మేలు జ‌రుగుతుంద‌ని సూచించారు. రాజ‌కీయాల్లో యువ‌త‌కు ప్ర‌త్యేక స్థానం ఉంద‌ని చెప్పారు.

తాజాగా ఇంట‌ర్‌, ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో ఉత్త‌మ మార్కులు సంపాయించుకున్న ప్ర‌భుత్వ కాలేజీలు, స్కూళ్ల విద్యార్థుల‌ను తాడే ప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో నారా లోకేష్ ఘ‌నంగా స‌త్కరించారు. వీరిని షైనింగ్ స్టార్స్‌ పేరుతో స‌త్క‌రించారు. అనంతరం.. విద్యార్థుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాజ‌కీయాల్లో యువ‌త‌కు ప్ర‌స్తుతం కీల‌క పాత్ర ఉంద‌ని తెలిపారు. వ‌చ్చే 10 సంవ‌త్స‌రాల్లో రాష్ట్ర రాజ‌కీయ ముఖచిత్ర‌మే కాకుండా.. దేశ‌రాజ‌కీయాలు కూడా చాలా వ‌ర‌కు మార్పు చెందుతాయ‌న్నారు. అప్పుడు యువ‌తకు మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని చెప్పారు.

ఇక‌, రాష్ట్రంలో కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. పాఠ‌శాల‌లు, కాలేజీల్లో జ‌రిగిన మార్పుల‌ను వివ‌రించారు. నాణ్య‌మైన విద్యను అందించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామ‌న్నారు. త‌ద్వారా ప్ర‌తి విష‌యంలోనూ విద్యార్థులు విజ్ఞానాన్ని పెంచుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డింద‌ని తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రికీ విద్య‌ను చేరువ చేయ‌డ‌మే ల‌క్ష్యంతోపాటు.. విలువ‌ల‌తో కూడిన విద్య‌ను అందించాల‌న్న‌దే త‌మ ధ్యేయ‌మ‌న్నారు. ఇక‌, ఫ‌లితాల‌ను చూసి విద్యార్థులు నిరాశ చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, తొలినాళ్ల‌లో ఓట‌ములు ఎదురైనా.. గెలుపు కోసం ప్ర‌య‌త్నించాల‌ని దిశానిర్దేశం చేశారు. మంగ‌ళ‌గిరిలో 2019లో తాను ఓడినా.. ప‌ట్టుద‌ల‌తో శ్ర‌మించి 2024లో విజ‌యం ద‌క్కించుకున్న విష‌యాన్ని ఆయ‌న వివ‌రించారు.