వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు. ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇలాంటి కీలక సమయాన ముద్రగడ కుమార్తె, జనసేన మహిళా నేత బర్లపూడి క్రాంతి సంచలన ఆరోపణలు గుప్పించారు. జగన్ కోసం తన తండ్రి తన పేరును సైతం మార్చుకుంటే… జగన్ మాత్రం తన తండ్రి పట్ల కనీస బాధ్యత కూడా చూపడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా వేదికగా క్రాంతి జగన్ తీరుపై నిప్పులు చెరుగుతూ ఓ సంచలన పోస్ట్ పెట్టారు. వైసీపీని ఆమె గూండాలు, రౌడీలు, గంజాయ్ బ్యాచ్ తో పోల్చారు. వైసీపీలోని రౌడీలు, గంజాయి బ్యాచ్ కు ఇస్తున్న విలువను కూడా తన తండ్రి పట్ల జగన్ చూపడం లేదని ఆమె విరుచుకుపడ్డారు. జగన్ కోసం తన తండ్రి ఏకంగా పేరునే మార్చుకున్న వైనాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించడం గమనార్హం. జగన్ కోసం తన తండ్రి అంత త్యాగం చేస్తే… చావు బతుకుల మధ్యలో ఉన్న తన తండ్రిని పరామర్శించే తీరిక కూడా జగన్ కు లేకపోయిందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతటితో ఆగని క్రాంతి… జగన్ తీరును విమర్శిస్తూ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవసరం ఉన్నంతవరకే జగన్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు గుర్తుంటారని ఆమె విమర్శించారు. అవసరం తీరాక వారందరినీ జగన్ మరచిపోతారని కూడా ఆమె ఆరోపించారు. గతంలో వైసీపీ కోసం సర్వం త్యాగం చేసిన తన తండ్రిని జగన్ ఇప్పుడు మరిచిపోయారని, జగన్ తీరే అంత అని ఆమె దెప్పి పొడిచారు. జగన్ తీరే ఇలా ఉంటే…ఇక వైసీపీ నేతల తీరు అంతకంటే మెరుగ్గా ఉంటుందని ఎలా అనుకొంటామని కూడా ఆమె సుతిమెత్తగానే సెటైర్లు సంధించారు. మొత్తంగా సింగిల్ పోస్ట్ తో ఆమె జగన్ అండ్ కోకు ఓ రేంజిలో ఇచ్చి పడేశారన్న వాదన వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates