‘రికార్డు’ వేలంపై హైకోర్టు స్టే!

అనుకున్నంతా అయ్యింది. హైదరాబాద్ లో భూముల ధరలు ఆకాశాన్నంటాయని చెప్పిన సర్కారీ వేలంపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఎస్బీఐ) దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం… ఎస్బీఐ అభ్యంతరాన్ని మన్నిస్తూ సర్కారీ వేలాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వెరసి అన్ని రికార్డులను బద్దలు కొట్టేసిన సర్కారీ వేలం పాట ప్రశ్నార్థకంగా మారిపోయింది.

గత నెల చివరలో రాయదుర్గం పరిధిలోని నాలెడ్జ్ సిటీకి చెందిన సర్వే నెంబరు 83/1లోని 7 ఎకరాల భూమిని తెలంగాణ సర్కారు వేలం వేసిన సంగతి తెలిసిందే. ఒక్క తెలంగాణ వాసులనే కాకుండా యావత్తు తెలుగు నేలలో అమితాసక్తి రేకెత్తించిన ఈ వేలంలో రికార్డు ధరలు నమోదు అయ్యాయి. మొత్తం 7 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేయగా… దానిని గౌర వెంచర్స్ ఒక్కో ఎకరానికి రూ.237 కోట్ల మేర రేటును కోట్ చేసి ఆ భూమిని దక్కించుకుంది. ఈ వేలం అప్పటిదాకా నమోదు అయిన అన్ని రికార్డులను బద్దలు కొట్టేసింది.

అయితే సర్కారు వేలం వేసిన సదరు భూమిలో 5 ఎకరాలు తమవేనని ఎస్బీఐ ఆరోపించింది. తన పేరిట ఉన్న ఈ భూమిని ప్రభుత్వం ఎలా వేస్తుందని ప్రశ్నించిన ఎస్బీఐ… సదరు వేలాన్ని రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై గురువారం విచారణ జరగగా… ఎస్బీఐ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ వేలాన్ని 3 వారాల పాటు నిలుపుదల చేస్తూ కూడా కోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.

ఈ వ్యవహారంలో ఈ భూమిని వేలం వేసిన తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ)కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కూడా హైకోర్టు సదరు సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. టీజీఐఐసీ దాఖలు చేసే కౌంటర్ ఆధారంగా ఈ భూముల వేలం రద్దు అవుతుందా? లేదా? అన్నది తేలుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.