ఏపీలోని బీచ్ లలో విదేశాల్లో మాదిరి బార్లను ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఊతం ఇచ్చే దిశగా బీచ్ లలో బార్లను ప్రవేశపెడుతున్న తీరుపై నిన్నటిదాకా అంతగా విమర్శలేమీ లేవనే చెప్పాలి. అయితే తాజాగా ఈ వ్యవహారంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి క్రమంగా పెరుగుతోంది. ఈ దిశగా జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీచ్ లలో మాత్రమే ఎందుకు గీతం వర్సిటీలోనూ బార్లను పెట్టండి అంటూ ఆయన ఓ సంచలన వ్యాఖ్య చేశారు.
బీచ్ లలో బార్ల ఏర్పాటుపై ఇటీవలే విశాఖ ఎంపీగా ఉన్న టీడీపీ యువ నేత భరత్ స్పందించిన సంగతి తెలిసిందే. బీచ్ లలో బార్లను ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంపీ భరత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బొలిశెట్టి తాజాగా స్పందించారు. బీచ్ లలో మాత్రమే ఎందుకు ఏకంగా మీ ఆధ్వర్యంలోని గీతం వర్సిటీలో కూడా బార్లను అనుమతించండి అంటూ బొలిశెట్టి ఘాటు వ్యాఖ్య చేశారు.
గురువారం నాటి మీడియా సమావేశంలో బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధుల నుంచే వ్యతిరేకత రాగా… ఆ అభ్యంతరాలపైనా బొలిశెట్టి తనదైన శైలి రూలింగ్ ఇచ్చేశారు. బీచ్ లకు అధికంగా వెళ్లేది యువతే కదా…విశ్వ విద్యాలయాల్లోనూ యువతే కదా ఉండేది… అందుకే బీచ్ లలో మాత్రమే ఎందుకు గీతం వర్సిటీలోనూ బార్లను పెట్టమని చెబుతున్నాను అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
విశాఖలోని రామకృష్ణ బీచ్ కు ఆ పేరు ఎలా వచ్చిందన్న విషయాన్ని ప్రస్తావించిన బొలిశెట్టి… రామకృష్ణ మిషన్ ఆ ప్రాంతంలోనే ఉంది కాబట్టే ఆ బీచ్ కు ఆ పేరు వచ్చిందని చెప్పారు. రామకృష్ణ మిషన్ పేరు మీద వెలసిన రామకృష్ణ బీచ్ లో మద్యం వద్దని తాను చెబుతున్నానన్నారు. బీచ్ లలో బార్లను పెడితే ఏమవుతుందన్న విషయాన్నీ ప్రస్తావించిన ఆయన.. బీచ్ లకు వచ్చే చిన్నపిల్లలు బార్ లలో మద్యపానం గురించి ఆరా తీస్తారు కదా అని ఆయన అన్నారు. రాజకీయాలు ఎలానైనా చేసుకోండి గానీ..బీచ్ లలో మాత్రం మద్యపానం వద్దని ఆయన చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates