సాయికృష్ణ ఘటనపై చంద్రబాబు సీరియస్

విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ యువకుడిపై పలు కేసులున్నాయని, ఈ క్రమంలోనే మే 9వ తేదీన అతడిని పోలీసులు తీసుకుపోయారని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత ఆ యువకుడు ఇంటికి రాలేదని, ఆ యువకుడు లాకప్ డెత్ కావడంతో పోలీసులే అతడి శవాన్ని తగులబెట్టారని కొందరు వైసీపీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

అంతేకాదు, ఆ యువకుడు జనసేన కార్యకర్త అని, ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆ ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు.

ఆ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆ ఆరోపణలపై ఉన్నతస్థాయి విచారణ జరిపి నిష్పక్షపాతంగా నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణ తర్వాత తనకు సమగ్ర నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించారు.

ఈ ఆరోపణల నేపథ్యంలోనే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సీఐను వీఆర్ కు పంపామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు.