`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె త‌న తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ మాదిరిగా వ్య‌వ‌హ‌రిస్తారు. త‌న మాట‌ల‌తోనే అంద‌రినీ ఆక‌ర్షిస్తారు. ఎక్క‌డా వివాదం అన్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు.. క‌విత మాటల్లో దొర్ల‌లేదు. పార్టీ ఆవిర్భావ స‌భ‌లో అయినా.. దీనికి ముందు అయినా.. క‌విత చేసిన‌ ప్ర‌సంగాలు అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. వాటికి ఆకర్షితుల‌య్యేవారు.. కొంద‌రు ఉండ‌గా, విశ్లేషించేవారు మ‌రికొంద‌రు ఉన్నారు.

అయినా.. ఎక్క‌డా క‌విత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశార‌ని ఎవ‌రూ చెప్ప‌లేదు. కానీ, తాజాగా ఆమె.. సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. అవి కూడా వివాదానికి దారితీయ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం సింగ‌రేణి కార్మికుల‌ను ప‌రామ‌ర్శిస్తున్న క‌విత‌.. `బాయిబాట‌` పేరుతో వారిని క‌లుస్తున్నారు. ఈ స‌మ‌యంలో ప‌లువురు కార్మికులు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొంటున్నారు. ఇదేస‌మ‌యంలో సింగ‌రేణి యాజ‌మాన్యం.. త‌మ‌ను ప‌ట్టించుకోవడం లేద‌ని కూడా మ‌రికొంద‌రు చెబుతున్నారు.

ఈ స‌మ‌యంలో వారిని ఓదార్చి భ‌రోసా ఇస్తున్న క‌విత‌.. ఆవేశానికి గురైన‌ట్టు క‌నిపించింది. మ‌వోయిస్టులకు మ‌ద్ద‌తుగా ఆమె వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని.. ప్ర‌జాసంఘాల నాయ‌కులు, పోలీసు ఉన్న‌తాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. మంచిర్యాలలో పర్యటించిన క‌విత‌.. మావోయిస్టుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌ప్పుడు అన్న‌లు ఉన్నార‌ని.. వారిని చూసి భ‌య‌ప‌డి సింగ‌రేణి కార్మికుల‌కు న్యాయం చేశార‌ని.. వ్యాఖ్యానించారు. అంతేకాదు.. వారు ఉన్నందునే కార్మికుల‌కు న్యాయం జ‌రిగింద‌ని ఇక్క‌డివారు చెబుతున్నార‌న్నారు.

ఇప్పుడు అన్న‌లు లేక‌పోవ‌డంతో సింగ‌రేణి యాజ‌మాన్యాన్ని అడిగేవారు ఎవ‌రూ ఉండ‌ర‌ని భావిస్తున్నార‌ని క‌విత అన్నారు. అన్న‌లు లేర‌ని, అందుకే త‌మ బ‌తుకుల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కార్మికులు చెబుతున్న‌ట్టు తెలిపారు. అయితే.. వారికి తాము అండ‌గా ఉంటామ‌ని క‌విత చెప్పారు. ప్ర‌జాసంఘాల‌ను పుర‌మాయించి.. కార్మికుల స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌తామ‌న్నారు. అన్న‌లు లేర‌న్న లోటును క‌విత‌మ్మ తీరుస్తుంద‌ని వ్యాఖ్యానించారు.