వైసీపీ ఫేస్‌బుక్ బ్లాక్‌… స‌ర్కారుపై జ‌గ‌న్ ఫైర్

ఏపీ ప్ర‌తిప‌క్షం(ప్ర‌ధాన కాదు) వైసీపీ సోష‌ల్ మీడియాలో దూకుడుగా ఉంటున్న విష‌యం తెలిసిందే. యూట్యూబ్‌, ఇన్‌స్టా, వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఎక్స్‌.. ఇలా అన్ని మాధ్య‌మాల్లోనూ వైసీపీ నాయ‌కులు దూకుడుగానే ఉంటున్నారు. వీటిలో కామెంట్ల‌తో పాటు.. ఫొటోలు, విశ్లేష‌ణ‌లు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా కూట‌మి ప్ర‌భుత్వంపైనే ఎక్కువ‌గా విమర్శ‌లు ఉంటున్నాయి. అయితే.. ప్ర‌జాస్వామ్యంలో ఎవ‌రి భావ‌ప్ర‌క‌టనా స్వేచ్ఛ వారికి ఉంటుంది. వైసీపీ చేసే కామెంట్ల‌కు టీడీపీ కూడా అదే రీతిలో బ‌దులిస్తంది.

అయితే.. వైసీపీకి చెందిన ఫేస్‌బుక్ ఖాతా బ్లాకా అయింది. ఆ పేజీ ఓపెన్‌కావ‌డం లేదు. ఇలా ఎవ‌రు చేశార‌న్న దానిపై క్లారిటీ లేదు. స‌హ‌జంగానే సోష‌ల్ మీడియాలో ఇలాంటి హ్యాకింగ్‌లు, బ్లాక్‌లు కామ‌న్‌గా మారాయి. ఎక్క‌డో విదేశాల్లో ఉంటున్న వారు.. ప‌నిగ‌ట్టుకుని ఇలా చేస్తున్న‌ట్టు ఢిల్లీలో ఇటీవ‌ల పోలీసులు కూడా చెప్పారు. అనేక సంద‌ర్భాల్లో బ్లాక్ అయిన వాటిని తిరిగి తెరిపించారు. తాజాగా వైసీపీ ఫేస్‌బుక్ ఖాతా కూడా బ్లాక్ అయింది. దీని వెనుక ఎవ‌రున్నార‌న్న‌ది తెలియాల్సి ఉంది. వాస్త‌వానికి ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తారు.

కానీ.. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎవ‌రికీ ఫిర్యాదులు చేయ‌కుండానే.. ఎలాంటి క్లారిటీ లేకుండానే.. కూట‌మి స‌ర్కారుపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే ఉద్దేశ పూర్వ‌కంగా త‌మ ఫేస్‌బుక్ ఖాతాను స్తంభింప చేసింద‌ని, త‌మ గొంతు నొక్కుతోంద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. ప్ర‌జ‌ల విష‌యంలో వారి స‌మ‌స్య‌ల విష‌యంలో అండ‌గా ఉన్నామ‌ని, ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తున్నామ‌ని.. అందుకే త‌మ‌పై క‌క్ష‌క‌ట్టి.. ప్ర‌భుత్వం ఫేస్‌బుక్ ఖాతాను నిలువ‌రించింద‌ని ఆరోప‌ణ‌ల అస్త్రాల‌ను ప్ర‌యోగించారు. వాస్త‌వానికి కూట‌మి స‌ర్కారు కూడా సోష‌ల్ మీడియాను ప్ర‌మోట్ చేస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో వైసీపీ ఖాతాను ఎందుకు బ్లాక్ చేస్తుంద‌న్న‌ది టీడీపీ నేత‌ల ప్ర‌శ్న‌.

అస‌లు వాస్త‌వాలు తెలుసుకోకుండా.. పోలీసుల‌కు కానీ.. సంబంధిత వ‌ర్గాల‌కు కానీ ఎలాంటి ఫిర్యాదులు చేయ‌కుండానే జ‌గ‌న్ గుడ్డిగా ఇలా ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాద‌ని అంటున్నారు. ఇదిలావుంటే.. త‌మ ఇన్‌స్టాను కూడా గ‌తంలో బ్లాక్ చేశార‌ని జ‌గ‌న్ ఆరోపించారు.

తాజాగా ఫేస్‌బుక్‌ను నిలిపివేశార‌ని.. దీనిపై న్యాయ‌పోరాటం చేస్తామ‌ని అన్నారు. నిజానికి ముందుగా ఏదైనా ఉంటే.. పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాలి. అక్క‌డ న్యాయం జ‌ర‌గ‌క‌పోతేనే కోర్టుల‌ను ఆశ్ర‌యించాలి. ఈ విష‌యాన్ని గ‌తంలో సుప్రీంకోర్టు సోష‌ల్ మీడియా కేసుల్లో తీర్పుల్లో పేర్కొంది. కానీ, జ‌గ‌న్ నేరుగా న్యాయ‌పోరాటానికి దిగుతామ‌ని చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.