ఏపీలో టీడీపీ-వైసీపీల మధ్య మాటల తూటాలు.. మరింత భారీ రేంజ్లో పేలుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు పెద్దగా కౌంటర్లు ఇవ్వలేకపోయారు. కానీ, తాజాగా పెరుగుతున్న యాక్టివిటీతో మాటల మంటలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో టీడీపీ అధినేత నుంచి దిగువస్థాయి నాయకుల వరకు వైసీపీని గొడ్డలి పార్టీ అని సంభోదిస్తున్నారు. దీనిని సమర్థించుకుంటున్నారు.
అయితే.. వాస్తవానికి గొడ్డలి పార్టీ అనే పదం కొంత విమర్శలకు దారితీసినా, వైసీపీ దీనిని స్వాగతించింది. అవును.. తమది గొడ్డలి పార్టీనే అని.. కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఔను.. జగన్ గొడ్డలే. అని సమర్థించుకున్నారు. తమది పరశురామ గొడ్డలి అని.. కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఈ గొడ్డలినే వినియోగిస్తామని చెప్పారు. ఇక, ఇప్పుడు మాజీ మంత్రులు.. కొడాలినాని, పేర్ని నాని కూడా.. దీనిని సమర్థించుకుంటున్నారు.
అంటే.. ఇక వైసీపీని గొడ్డలి పార్టీ అని పిలిచే అవకాశం.. లైసెన్సును కూడా అధికారికంగానే ఇచ్చేసినట్టు అయింది. తమ నాయకుడు.. పరశురామగొడ్డలి వంటివాడని.. కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో కూటమి అవినీతి పాలనను అంతమొందిస్తారని కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి కౌంటర్గా.. టీడీపీ నాయకులు మరిన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అది పరశురామ గొడ్డలి కాదు.. వివేకా గొడ్డలి అని మీడియా ముందు చెబుతున్నారు.
కడపలో ఇదే అనుకుంటున్నారని.. పరశురామ గొడ్డలి కాదని.. బాబాయి గొడ్డలి.. లేదా వివేకా గొడ్డలి అని పిలుస్తున్నారని.. టీడీపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా.. రాష్ట్రంలో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య గొడ్డలి రాజకీయాలు ఓ రేంజ్లో సాగుతుండడం గమనార్హం. దీనివల్ల వైసీపీకే ఇమేజ్ తగ్గుతుందని విశ్లేషకులు చెబుతుండగా.. కాదు.. తమ నాయకుడి ఇమేజ్ మరింత పెరుగుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. సో.. ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ ఏదైనా ఉంటే.. ఈ గొడ్డలి వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
