తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నేతలకు మధ్య పలు కేసుల విచారణకు సంబంధించి రాజకీయం జోరుగా సాగుతోంది. బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హయాంలో జరిగిన.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారిందని..దీనిని సీబీఐతో దర్యాప్తు చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. కానీ, దీనిపై ఇప్పటి వరకు అతీ గతీ లేదని, కేసీఆర్ను కాపాడుతున్నారని సీఎం రేవంత్ పలుసందర్భాల్లో ఆరోపించారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ అధికారులు కొందరు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ ఉన్నతాధికారులు విదేశాలకు వెళ్లిపోవడంతో, వారిపై రెడ్కార్నర్ నోటీసులు జారీ చేయడానికి సీబీఐ ఇంటర్పోల్కు లేఖ రాసింది. ఫోన్ట్యాపింగ్ కేసులో అవినీతి కోణాలు కూడా ఉన్నాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం… ఈడీ, సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ.. లేఖలు సంధించింది. కానీ, ఇప్పటి వరకు కేంద్రం నుంచి సరైన సమాధానం రాలేదన్నది సర్కారు చెబుతున్న మాట.
కట్ చేస్తే..
ఈ విషయాన్ని కట్ చేస్తే.. తాజాగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరో డిమాండ్ చేశారు. సింగరేణి కేలరీస్ లో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని వార్తలు వస్తున్నాయని ఆయన తెలిపారు. దాదాపు 16 వందల కోట్ల రూపాయల విలువైన బొగ్గు దారి మళ్లిందని.. ఇదంతా ఎవరి హయాంలో జరిగింది? దీనివెనుక ఎవరు ఉన్నారు? అనే విషయాలను తేల్చాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దర్యాప్తు చేయించాలని కిషన్ రెడ్డి కోరారు. అంతేకాదు.. సింగరేణి భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు.
రచ్చ కొనసాగుతుందా?
కేసీఆర్ సర్కారు కేంద్రంగా ఇటు కాంగ్రెస్, అటు బీజేపీలు పరస్పరం విమర్శలు చేసుకుంటూనే ఉన్నాయి. అంతేకాదు.. ఒకరిపై ఒకరు మీరు విచారణ చేపట్టాలంటే మీరు విచారణ చేపట్టాలని నిలదీతలు కనిపిస్తున్నాయి. ఇంతకు మించి.. ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం వెనుక వీటిని రాజకీయ వస్తువులుగానే వినియోగించుకునే అవకాశం ఉందన్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
కాగా.. ప్రస్తుతం కిషన్ రెడ్డి లేవనెత్తిన సింగరేణి బొగ్గు గనుల వ్యవహారం కూడా రాజకీయపరమైన అంశంగానే కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే.. బొగ్గుగని కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నా.. గనుల నిల్వలు.. సరుకు రవాణా.. కేటాయింపు ఇలా.. అన్ని విషయాలు బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి పరిధిలోనే ఉంటాయి. కాబట్టి.. ఈ రచ్చ ఇలా కొనసాగుతుందా.. లేక పరిష్కారం లభిస్తుందా? అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
