అమ‌రావ‌తిపై కామెంట్స్‌… వీడియోతో కొట్టిన లోకేష్‌!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ఇటీవ‌ల కొంద‌రు నేత‌లు.. మేధావుల‌మ‌ని చెప్పుకొనే కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప‌నులు మంద‌గించాయ‌ని.. ప‌నిచేస్తున్న కార్మికులు కూడా వెళ్లిపోతున్నార‌ని.. వారు సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. మ‌రికొంద‌రు ప్ర‌ధాన మీడియా చ‌ర్చ‌ల్లోనూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇప్పుడు వేస‌వి కాలంలోనే ప‌నులు ముందుకు సాగ‌డం లేద‌ని.. వ‌ర్షాకాలం ప్రారంభ‌మైతే.. ఇక‌, ప‌నులు సాగ‌వ‌ని వారు పేర్కొన్నారు.

ఈ క్ర‌మంలో అమ‌రావ‌తిపై కామెంట్స్ చేసేవారికి.. తాజాగా మంత్రి లోకేష్ వీడియోతో స‌మాధానం ఇచ్చారు. అమ‌రావ‌తిలో నిరంత‌రాయంగా జ‌రుగుతున్న ప‌నుల‌కు సంబంధించిన వీడియోను ఆయ‌న పోస్టు చేశారు. వ‌ర్షాకాలం.. వేస‌వి కాలం అనే తేడా లేకుండా.. ఇక్క‌డ ప‌నులు సాగుతున్నాయ‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్ట‌ర్లు.. పూర్త‌య్యాయ‌ని.. మ‌రో రెండు మూడు రోజుల్లోనే వీటిని ప్ర‌భుత్వానికి అప్ప‌గించ‌నున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ఇక‌, రెండో ద‌శ భూ స‌మీక‌ర‌ణ‌కు రైతులు స‌హ‌క‌రించ‌డం లేద‌న్న విమ‌ర్శ‌ల‌కు కూడా చెక్ పెట్టారు. రైతులు తాజాగా 70 ఎక‌రాల భూముల‌ను సీఆర్ డీఏ అధికారుల‌కు మంత్రి నారాయ‌ణ స‌మ‌క్షంలో ఇచ్చిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. సీఎం చంద్ర‌బాబు రాజ‌ధాని ప‌నుల‌పై నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్న తీరును కూడా వివ‌రించారు. కాలం ఏదైనా అమ‌రావ‌తి కాలం నడుస్తోంద‌ని త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ప‌నులు జ‌రుగుతున్న తీరును చూసి కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్న తీరును ఆయ‌న ఖండించారు.

అన్ స్టాప‌బుల్‌

అమ‌రావ‌తి ప‌నులు అన్ స్టాప‌బుల్ అని నారా లోకేష్ తెలిపారు. నిర్మాణాలు టాప్ గేర్‌లో ముందుకు సాగుతున్నాయ‌న్నారు. వర్షం పడితే అమరావతి మునిగిందంటూ ట్రోల్ చేసే వారికి సారీ బ్రో అని సెట‌ర్లు వేశారు. అమ‌రావ‌తిపై ట్రోల్ చేసేవారు చాలా క‌ష్ట‌ప‌డుతున్నారు. అందుకే.. ఈ వీడియో అని వ్యాఖ్యానించారు. రాజ‌ధాని నిర్మాణ ప‌నుల్లో పాజ్‌ అనే ప‌ద‌మే వినిపించ‌ద‌ని పేర్కొన్నారు.