మొన్నటిదాకా రాయలసీమ అంటే కరువు సీమ కిందే లెక్క. ఏ రాజకీయ పార్టీ అదికారంలోకి వచ్చినా… రాయలసీమ ఓట్లను గంపగుత్తగా వేయించుకునేందుకు రాయలసీమను రతనాల సీమ చేస్తామంటూ చెప్పేవారు. ఎన్నికల సమయంలో అందరి నోటా వినిపించే ఈ మాట… ఆ తర్వాత ఎప్పుడో ఆయా పార్టీల బహిరంగ సభల్లోనే వినిపించేది. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. కూటమి పాలనలో రాయలసీమ రతనాల సీమ కాలేకున్నా… ‘రాయల్’ సీమగా అయితే మారిపోయింది. కూటమి సర్కారు సాదించిన పెట్టుబడులతో సీమ ఇప్పుడు పెట్టుబడులకు హబ్ గా మారిపోయింది.
ఇదే విషయం జనానికి అర్థమయ్యేలా టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఏపీ కేబినెట్ లో కీలక శాఖల మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రాయలసీమ ఇప్పుడు ‘రాయల్’ సీమ అని, రాజసం ఉట్టి పడేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి బాటన నడిపిస్తున్నామని ఆయన చెప్పారు. లోకేశ్ ఈ మాటను ఎక్కడో వేరే ఏ ప్రాంతంలోనో చెప్పలేదు. రాయలసీమలోని తిరుపతి కేంద్రంగా జరిగిన కూటమి పార్టీల విజయోత్సవ సభలోనే ఆయన ఈ వ్యాఖ్య చేశారు. లోకేశ్ నోట నుంచి వచ్చిన ఈ మాట సీమ వాసులనే కాకుండా అందరినీ ఆకట్టుకుందని చెప్పాలి.
రాయలసీమ ఇప్పుడు ‘రాయల్’ సీమగా మారిపోయిందని చెప్పిన లోకేశ్… సీమలో ఇటీవలే రాయల్ ఎన్ ఫీల్డ్ బైకుల తయారీ పరిశ్రమ వచ్చిందన్న కోణంలోనే ఈ వ్యాఖ్య చేసి ఉండవచ్చు గానీ… వాస్తవ పరిస్థితి చూస్తే… ఈ వ్యాఖ్య అక్షర సత్యమని చెప్పక తప్పదు. రాష్ట్రానికి వస్తున్న భారీ పెట్టుబడుల్లో అగ్ర తాంబూలం రాయలసీమ ప్రాంతంలోనే గ్రౌండ్ అయ్యేలా లోకేశ్ వ్యూహాలు రచిస్తున్నారు. విస్తారమైన వనరులు కలిగిన సీమను ఈ పెట్టుబడులతో కూటమి సర్కారు నిజంగానే ‘రాయల్’ సీమగా మార్చేసిందన్న వాదనలు అయితే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
రాయలసీమలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా కియా కార్ల కంపెనీ ఏర్పాటైంది. ఈ కంపెనీ రాకతో ఎడారి జిల్లాగా కనిపించిన అనంతపురం జిల్లా రూపురేఖలే మారిపోయాయి. కియా కంపెనీ రాకతో ఆ జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు చాలానే వచ్చాయి. హంద్రీ నీవా ప్రాజెక్టు పూర్తితో అనంత జిల్లా భూములు బంగారాన్ని పండిస్తున్నాయి. ఇక ఇటీవలే రక్షణ శాఖ అనంత జిల్లాలోనే యుద్ధ విమానాల టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అనంతను ఆనుకుని ఉన్న కర్నూలు జిల్లా గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారిపోయింది.
ఇక మొన్నటిదాకా చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుపతి జిల్లాలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. అందులో భాగంగానే బుల్లెట్ బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ తమ సొంత రాష్ట్రం తమిళనాడు వెలుపల తన తొలి యూనిట్ ను తిరుపతి జిల్లాలోనే ప్రారంభించింది.
సత్యవేడు సెజ్ తో పాటు దాని పొరుగునే ఉన్న శ్రీ సిటీలోనూ పెద్ద సంఖ్యలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. ఇక ఫ్యాక్షన్ కక్షల ఖిల్లాగా పేరుపడిన కడప జిల్లాలో ఇటీవలే భారీ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు అయ్యింది. వెరసి ఆ జిల్లా కూడా పారిశ్రామికంగా కొంగొత్త అడుగులు వేస్తోంది. ఈ లెక్కన లోకేశ్ నోట వినబడిన ‘రాయల్’ సీమ కామెంట్ ఆ ప్రాంతంలోని ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టినట్టేనన్న వాదన వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
