తెలంగాణలో జనసేన అధినేత పవన్కల్యాణ్.. ఈ నెల 2న నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. దీంతో ఆయన అదే రోజు.. తన ఇంట్లోనే మీడియా సమావేశం పెట్టారు. ఈ సందర్భంగానే తెలంగాణ మీ జాగీరా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారం.. పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు సైతం .. పెద్ద ఎత్తున పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలు విషయాలు పంచుకున్నారు.
తెలంగాణలో జనసేన పార్టీ పెట్టొచ్చు. పవన్ రావొచ్చు. ఆయనే స్వయంగా పోటీ కూడా చేయొచ్చు. ఎవరు వద్దన్నరు. అని రేవంత్ వ్యాఖ్యానించారు. అయితే.. నువ్వు ఏ రాష్ట్రంలో పార్టీ పెట్టాలని అనుకున్నవో.. ఎక్కడ నీ జెండా ఎగరాలని అనుకున్నవో .. ఆ బిడ్డలను తిట్టొచ్చా. మా తెలంగాణ బిడ్డలను అంటే మాకు పౌరుషం రాదా?
అందుకే.. పవన్పై మావోళ్లు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అని రేవంత్ చెప్పారు. ఇక, ఆనాడు.. సభకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక ఎలాంటి కుట్రలు లేవని.. పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారించారని తెలిపారు. ఈ విచారణలో.. శాంతి భద్రతల సమస్య వచ్చే అవకాశం ఉందన్నారని.. దీంతోనే అనుమతి నిరాకరించామని చెప్పారు.
జగన్కు సమాధానం చెబుతారా?
ఆరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన వచ్చి.. ఏం మాట్లాడతాడో అని పోలీసులు భావించారు. ఏచిన్న పొరపాటు మాట మాట్లాడినా.. తెలంగాణ జనాలు ఊరుకుంటరా? అందుకే.. సభకు వద్దన్నాం అని రేవంత్ స్పష్టం చేశారు.
అయితే.. దీనిని తప్పుగా చూపించే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఇదిలావుంటే.. ఆనాడు జగన్ కూడా బాధితుడేనని రేవంత్ వ్యాఖ్యానించడం గమనార్హం. గతంలో జగన్ సభలకు ఏపీలోనూ అనుమతి ఇవ్వలేదని.. దీంతో ఆయన కూడా బాధపడ్డాడని.. దీనికి పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
మోడీనే నన్ను కోరుకున్నాడు..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే తనను కోరుకుంటున్నారని.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను వెళ్లి మోడీని ఆలింగనం చేసుకోలేదని.. ఆయనే తన వద్దకు వచ్చి ఆలింగనం చేసుకున్నారని తెలిపారు. దీనిని బట్టి ఎవరు ఏం అర్ధం చేసుకున్నా.. తనకు కానీ.. కాంగ్రెస్ పార్టీకి కానీ వచ్చే నష్టమేమీ లేదన్నారు.
రాష్ట్రాల హక్కుల కోసం.. మోడీ పై కొట్లాట కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. ఈ విషయంలో రాజీ పడే ధోరణి కూడా లేదన్నారు. జీఎస్టీ సొమ్ముల్లో అన్యాయం జరుగుతోంది.. ప్రాజెక్టుల్లో అన్యా యం జరుగుతోందని చెప్పారు. వీటిని ప్రశ్నిస్తూనే ఉన్నామన్నారు. ఈ నెల 15 లోగా వడ్లు కొనకపోతే.. పెద్ద యుద్ధం జరిగినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
