గుడివాడలో నాని!.. ఏమాత్రం తగ్గలే!

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని… చాలా రోజుల తర్వాత తన సొంతూరు గుడివాడకు శుక్రవారం వచ్చారు. 2024 ఎన్నికల్లో పరాజయం తర్వాత గుడివాడను వీడిన నాని… హైదరాబాద్ కేంద్రంగానే ఉంటున్నారు. అడపాదడపా కోర్టు కేసుల నిమిత్తం గుడివాడ వచ్చినా… ఆ తంతు ముగించుకుని వెంటనే తిరిగి వెళ్లిపోయేవారు. అయితే శుక్రవారం గుడివాడ వచ్చిన నాని… వెన్నుపోటుకు రెండేళ్లు పేరిట వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

రాజకీయ ప్రత్యర్థులపై పరుషమైన పదజాలం వాడే విషయంలో నానిని మించిన వారెవ్వరూ లేరని చెప్పాలి. టీడీపీతోనే రాజకీయాలు మొదలుపెట్టిన నాని.. ఆ తర్వాత ఆ పార్టీని వీడి వైసీపీలో చేరిపోయారు. ఆ తర్వాత ఆయన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడితో పాటు ఆయన కుమారుడు నారా లోకేశ్ లపై ఘాటు విమర్శలు చేయడం నానికి అలవాటుగా మారింది. వైసీపీ అధికారంలో ఉండగా… ఈ తరహా వైఖరికి మరింతగా పదును పెట్టిన నాని… తన పార్టీ విపక్షంలోకి చేరినా ఆ జోరును ఏమాత్రం తగ్గించలేదనే చెప్పాలి.

చాలా రోజుల తర్వాత గుడివాడ వచ్చిన నాని… నిరసన కార్యక్రమంలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఎప్పటిలాగే చంద్రబాబు, లోకేశ్ లపై ఆయన తనదైన శైలి విమర్శలు గుప్పించారు. 2024 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలును పక్కనపెట్టేసిన బాబు, లోకేశ్ లు… ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. బాబు, లోకేశ్ లు వెన్నుపోటు విద్యలో ఆరితేరిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.

ఇక వైసీపీకి గొడ్డలి పార్టీ అని పేరు పెట్టిన చంద్రబాబు, లోకేశ్ ల తీరుపై విరుచుకుపడిన నాని… టీడీపీనే పచ్చ గొడ్డలి అని ఆరోపించారు. ఇక టీడీపీ నేతలు నిత్యం పలుకుతున్న గొడ్డలి పార్టీకి నాని సరికొత్త అర్థం చెప్పారు. శివుడు, దుర్గా దేవి, వినాయకుడు… ఇలా దేవుళ్ల చేతిలో గొడ్డలి ఉంటుందని ఆయన అన్నారు.

ఈ గొడ్డలిని పాపాత్ములను శిక్షించేందుకు వాడతారన్న నాని… జగన్ చేతిలో ప్రజలే పరుశురాముడి గొడ్డలిని పెడతారని అన్నారు. 2029 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే ఆ గొడ్డలితో జగన్ టీడీపీని రాజకీయ సమాధి చేస్తారన్నారు. అవినీతిలో మునిగిపోయిన కారణంగానే జగన్ చేతిలోని గొడ్డలిని చూసి టీడీపీ భయపడుతోందని ఆయన తనదైన శైలి వ్యాఖ్య చేశారు.