రాజ్యసభ స్థానాల అభ్యర్థుల ఎంపికలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పేరు ప్రముఖంగా వినిపించింది. ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. అయితే ఒక్కసారిగా సీన్ తారుమారైంది. కాంగ్రెస్ పార్టీ జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో అసలేం జరిగింది అనే అంశంపై చర్చ మొదలైంది. తన అభ్యర్థిత్వంపై ఇంతవరకు స్పందించని షర్మిల ఇప్పుడు నోరు విప్పారు. ‘‘రాజ్యసభ సీటు మాట ఇచ్చిన వాళ్లకు, మాట తీసుకున్న వాళ్లకు మాత్రమే సంబంధించిన విషయం..’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన సమయం నుంచి ఆమెను కర్ణాటక లేదా ఇతర రాష్ట్రాల నుంచి పెద్దల సభకు పంపుతారనే బలమైన ప్రచారం సాగింది. సాక్షాత్తూ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం నడిచినప్పటికీ, చివరి నిమిషంలో ఆమెకు మొండిచేయి ఎదురుకావడం వెనుక ఢిల్లీ వేదికగా భారీ హైడ్రామా నడిచినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో షర్మిల పలు రాజకీయ అంశాలపై బీజేపీని విమర్శించారు. ఆ విమర్శలను తిప్పికొడుతూ బీజేపీ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘రాజ్యసభ సీటు రాకపోవడంతో ఏర్పడిన అసహనంలో షర్మిల గారు ట్వీట్ చేస్తూ వాస్తవాలను పూర్తిగా విస్మరించినట్టున్నారు…’’ అంటూ బీజేపీ తన ప్రకటనలో పేర్కొంది. చరిత్ర గురించి మాట్లాడే ముందు, దశాబ్దాల పాటు దేశాన్ని అవినీతి, కుటుంబ పాలన, కుంభకోణాలతో వెనక్కి నెట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ 60 ఏళ్ల పాలనను ఒక్కసారి అద్దంలో చూసుకోవాలని కూడా కౌంటర్ ఇచ్చింది.
దీనిపై ఘాటుగా స్పందించిన వైఎస్ షర్మిల… ‘‘మధ్యలో మీ అసహనం ఏంటి? ఈ అతి స్పందన ఎందుకు? 12 ఏళ్ల వైఫల్యాలను ప్రజల ముందు పెడితే, సమాధానం చెప్పే దమ్ములేక, అర్థంపర్థం లేని అంశాలను మాట్లాడే మీ సంస్కారం ఏపాటిదో అర్థమైంది..’’ అంటూ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. మొత్తం మీద తనకు దక్కని రాజ్యసభ సీటుపై వైఎస్ షర్మిల స్పందించడం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
