టార్గెట్ కాంగ్రెస్‌… పవన్ కీల‌క వ్యూహం?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజ‌కీయంగా త‌న‌కు ఉన్న ల‌క్ష్యాన్ని కూడా వివ‌రించారు. దేశాన్ని ఐక్యం చేయ‌డంతోపాటు.. ఉత్త‌ర‌-ద‌క్షిణ ప్రాంతాలు అనే భేదాన్ని తుడిచి పెట్టి.. అంద‌రూ ఒక్క‌టే అనే విధంగా దేశాన్ని క‌లిపి ఉంచాల‌న్న త‌న మ‌న‌సులోని భావాల‌ను వెల్ల‌డించారు. అదేస‌మ‌యంలో త‌న టార్గెట్ కూడా కాంగ్రెస్ పార్టీనేన‌ని ఆయ‌న ప‌రోక్షంగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ విధానాల కార‌ణంగానే దేశంలో విభ‌జ‌న వాదం వ‌చ్చింద‌ని పేర్కొన్నారు.

అంతేకాదు… ఏపీ, తెలంగాణ‌ల‌ను విడ‌దీసినందుకు, తెలంగాణ ఇచ్చినందుకు త‌న‌కు బాధ‌లేద‌న్న ఆయన‌.. విభ‌జ‌న చేసిన తీరును, ఏపీకి మిగిల్చిన క‌ష్టాల‌పైనే త‌న ఆవేద‌న అని పేర్కొన్నారు. దీనికి మూల కార‌ణం.. కాంగ్రెస్ పార్టీనేన‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాదు.. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలోనూ కాంగ్రెస్ పార్టీ చేసిందే ఘోర త‌ప్పిద‌మ‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌ధాని మోడీని ఆడిపోసుకోవ‌డం స‌రికాద‌ని పేర్కొన్నా రు. ఆనాడే పార్ల‌మెంటులో చ‌ట్టంలో చేర్చి ఉంటే స‌మ‌స్య ఉండేది కాద‌న్నారు.

అంతేకాదు.. ప‌లువురు ముఖ్య‌మంత్రులు(కాంగ్రెస్‌) ఉత్త‌రం, ద‌క్షిణం అంటూ.. దేశానికి గోడ‌లు క‌ట్టే ప్ర‌యత్నం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. త‌న దృక్ఫ‌థంలో దేశం అంతా ఒక్క‌టేన‌ని చెప్పారు. దేశ ఐక్య‌త కోసం.. ఎంతోమంది ప్ర‌య‌త్నించార‌ని.. కానీ.. కాంగ్రెస్ పార్టీ విభ‌జ‌న వాదాన్ని భుజాన మోస్తోంద‌ని చెప్ప‌కనే చెప్పారు. త‌ద్వారా.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న రాజ‌కీయ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్ పార్టీనేన‌ని వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. దీనిని బ‌ట్టి రాబోయే రోజుల్లో జాతీయ‌స్తాయి కావొచ్చు.. ప్రాంతీయ స్థాయి కావొచ్చు.. ప‌వ‌న్ వ్యూహం.. కాంగ్రెస్‌పైనే ఉంటుంద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది.

మోడీ దిశానిర్దేశం..

ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను నిశితంగా గ‌మ‌నిస్తే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు లేని ఉత్తేజం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఏపీకి, తెలంగాణ‌కు ప‌రిమిత‌మైతే.. తొలిసారి దేశ ఐక్య‌త‌, స‌మ‌గ్ర వ్యూహం.. అన్ని ప్రాంతాలు ఒక్క‌టేన‌న్న భావ‌న‌ను వినిపించారు. త‌ద్వారా.. దేశంలోని త‌ట‌స్థుల‌ను ఆయ‌న ఆక‌ర్షించే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే.. దీనివెనుక ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ దిశానిర్దేశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇది ప‌వ‌న్‌ను జాతీయ నేత‌గా తీర్చిదిద్దినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు.