అమరావతిలో రూ.2.5 వేల కోట్ల కేంద్ర ప్రాజెక్టు

అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా కాకుండా చేయడం ఇక ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఒక వేళ కూటమి సర్కారు కాకుండా ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా కూడా రాజధానిని అమరావతి నుంచి తరలించడం అసలు కుదరనే కుదరని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే… అమరావతికి శాశ్వత రాజధాని హోదా కల్పిస్తున్నట్లుగా బుదవారం కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయాన్ని భారీ ఎత్తున నిర్మించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం కాగా.. దానిని బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

దేశానికి అత్యధిక కాలం ప్రదానిగా పనిచేసిన విషయంలో నరేంద్ర మోదీ రికార్డు నెలకొల్పిన నేపథ్యంలో బుధవారం కేంద్ర కేబినెట్ కీలక భేటీ జరిగింది. ఈ భేటీలో ప్రదానికి మంత్రులంతా అబినందనలు తెలిపారు. మోదీ రికార్డును కీర్తించేందుకే ఏర్పాటు అయిన ఈ సమావేశంలో అమరావతి గురించి కీలక ప్రాజెక్టుపై చర్చ జరగడం, ఆ ప్రాజెక్టుకు కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించడం చూస్తుంటే… అమరావతికి ఇప్పటిదాకా రాని బిగ్ బూస్ట్ ఈ భేటీలోనే వచ్చిందని చెప్పాలి. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే… అమరావతికి ఓ విస్పష్ట రూపం వచ్చేసినట్టేనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

అమరావతికి సంబంధించి కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ వివరించారు. మంత్రి చెప్పిన వివరాల ప్రకారం అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నివాస భవన సముదాయాలను రూ.2,534 కోట్లతో నిర్మించనున్నారు. ఈ మేరకు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ (సీపీడబ్ల్యూడీ) రూపొందించిన ప్లాన్ కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

సెంట్రల్ గవర్నమెంట్ ఆపీసెస్ కార్యాలయం (సీజీఓ)ను అమరావతిలో 5.53 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. చతురస్రాకారంలో నిర్మితం కానున్న ఈ భవనం కోసం కేంద్రం ఏకంగా రూ.1,299 కోట్లను వెచ్చించనుంది. ఈ భవనంలో దాదాపుగా 23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి రానుంది. ఇందులోనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ని కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు. వెరసి అమరావతిలో అన్ని కేంద్ర కార్యాలయాలన్నీ ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి.

ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాసాల కోసం 17 ఎకరాల విస్తీర్ణంలో నివాస భవన సముదాయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ భవనంలోనే ఆయా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులంతా ఇక్కడే నివాసం ఉంటారు. ఈ భవనం కోసం కేంద్రం రూ.1,234.91 కోట్లను వెచ్చించనుంది. 17 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఏకంగా 11 టవర్లను ఏర్పాటు చేయనున్న కేంద్రం… అందులో 1,500 ప్లాట్ల మేర ఫ్లాట్లను తీర్చిదిద్దనుంది. మొత్తంగా అమరావతిలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా ఒకే చోట పనిచేయడంతో పాటుగా ఒకే చోట నివాసం ఉండేలా కేంద్రం చర్యలు చేపట్టింది.