న‌ట‌రాజ‌న్‌… కింక‌ర్త‌వ్యం…?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజ‌న్‌ పరిస్థితి ఏమవుతుంది? అనేది ఆస‌క్తిగా మారింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్లాలని భావించిన ఆమెకు భారీ షాక్ తగిలింది. ఆమె సమర్పించిన ఎన్నికల అఫిడ‌విట్‌లో త‌న‌పై ఉన్న కేసులను ప్రస్తావించలేదన్నది ఎన్నికల సంఘం తెరమీదకు తీసుకువచ్చిన ప్రధాన విషయం. సహజంగా ఎన్నికల నామినేషన్ దాఖలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చూసుకుంటారు. లోపాలు లేకుండా సరిచేసుకుంటారు. ఏ చిన్న తేడా వచ్చినా తిరస్కరించడం కామన్ గా జరిగే ప్రక్రియ. దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు.

మరి ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ తెలియ‌క చేశారా లేకపోతే సొంత పార్టీలోనే ఆమెను వ్యతిరేకించే వర్గం ఉన్నారా అనే విషయంపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించాలని మీనాక్షి నటరాజ‌న్‌కు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించింది. ఈ క్రమంలో సోమవారం అంటే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు ఆమె తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆమె సమర్పించిన అఫిడ‌విట్‌లో గతంలో ఉన్న కేసులను ప్రస్తావించలేదని స్థానిక బిజెపి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

దీంతో హుటాహుటిన ఆమె ఎన్నికల పత్రాలను పరిశీలించిన అధికారులు వాటిని తిరస్కరించారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే మీనాక్షి నటరాజన్ స్థానానికి పోటీగా బిజెపి అభ్యర్థి ఒకరు నామినేషన్ వేశారు. దానిని అంగీకరించే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఈ స్థానం బిజెపికి పోతుంది అనే చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్‌ను ఏ విధంగా సంతృప్తి పరుస్తారు అనేది చూడాలి. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీకానున్నాయి. ఈ క్రమంలో ఆమెకు ఒక స్థానం ఇచ్చే అవకాశం ఉందని తెలంగాణ రాజకీయ వర్గాలు తెలిపాయి.

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు మీడియాకు ఇదే విష‌యం ముందు చెప్పారు. అయితే దీనిపై పార్టీ పరంగా స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న మీనాక్షి నటరాజన్‌ చిన్న పొరపాటు కారణంగా రాజ్యసభ స్థానాన్ని కోల్పోవడం గ‌మ‌నార్హం. అది బిజెపికి ద‌క్క‌డం.. కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బందికర పరిణామాలు తీసుకువచ్చింది. తాజా ప‌రిణామాల‌పై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీనియ‌ర్ నేత‌ల‌తో చ‌ర్చించారు. న‌ట‌రాజ‌న్‌కు రాష్ట్రం నుంచే అవ‌కాశం ఇచ్చే ఛాన్స్ క‌నిపిస్తోంద‌ని తెలిసింది.