ఈ రోజు జనసేన తలపెట్టిన ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం’ సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అధినేత , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్, తెలంగాణలోకి తనను అడుగు పెట్టనివ్వబోమని అంటున్నారని, తెలంగాణ మీ అయ్య జాగీరా? అంటూ పవన్ నిప్పులు చెరిగారు.
తాను తెలంగాణ నలు మూలలా తిరిగానని, తెలంగాణ బాగుండాలని అనుకునే వాడినని పవన్ అన్నారు. 2007లోనే తనను ఈ రోజు విమర్శిస్తున్న గొంతులు లేవని అన్నారు. ఆదిలాబాద్ లాంటి నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో తిరిగానని చెప్పారు. తెలంగాణపై ఈ రోజు కొత్తగా ప్రేమ రాలేదని స్పష్టం చేశారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని, విభజన జరిగిన తీరుకు వ్యతిరేకం అని పవన్ చెప్పారు. పార్లమెంట్ తలుపులు మూసి ఉమ్మడి ఏపీని విభజించిన తీరుకు జనసేన వ్యతిరేకం అని, ఈ విషయంపై తెలంగాణ ప్రజలకు మరోసారి స్పష్టతనిస్తున్నానని పవన్ అన్నారు.
సామాజిక తెలంగాణ నినాదంతో అన్ని కులాలు బాగుండాలి అన్నదే జనసేన విధానం అని అన్నారు. తెలంగాణ సంస్కతిపై, తెలంగాణపై తనకు ఎంత ప్రేమ ఉందో తనను విమర్శించే నాయకులకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు. కష్టంలో ఉన్నప్పుడు తన వెంట ఉన్నది తెలంగాణ ప్రజలని, వారాహికి అనుమతినిచ్చింది తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates