ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే.. మారుతున్న రాజకీయాలు.. ప్రజలకు మరింత చేరువ కావాల్సిన పరిస్థితి.. పక్కా మాస్గా ఆయనను మార్చేస్తున్నాయి. ఇటీవల బాపట్ల జిల్లాలో పర్యటించిన ఆయన.. ఓ మత్స్యకారుడి కుటుంబాన్ని పలకరించి.. చేపలు కొని.. వారి ఇంట్లోనే వంట చేయించుకుని భోజనం చేశారు.
తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు.. పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధి దారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం.. వస్తూ వస్తూ.. సాయంత్రం 6 గంటల సమయంలో అనూహ్యంగా ఆయన తన కాన్వాయ్ను రోడ్డు పక్కన ఆపించారు. ఆ పక్కనే దూరంగా కల్లు విక్రయిస్తున్న వారి వద్దకు నడుచుకుంటూ వెళ్లి.. వారిని పలకరించారు.
ఈ సందర్భంగా వారి కుండల్లోని కల్లును తాడి డొప్పలో పోయించుకుని రుచి చూశారు. చాలా బాగుందని.. ఇది ఈతకల్లా.. తాటికల్లా..అని వారిని అడిగి తెలుసుకున్నారు. కల్లు వృత్తి దారులకు ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించారు. మద్యం దుకాణాల్లో వారికి 2 శాతం షాపులను కేటాయించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆదాయం ఎంత? కుటుంబాలకు వస్తున్న సంక్షేమ పథకాలు వంటి వివరాలను కూడా తెలుసుకున్నారు.
అయితే.. చంద్రబాబు కల్లు సేవించడం.. ఇదే తొలిసారి. ఆయన గతంలోనూ కల్లు గీత కార్మికులతో భేటీ అయినా.. వారి సమస్యలు తెలుసుకున్నా.. ఎప్పుడూ.. కల్లు తీసుకుంది లేదు.. రుచి కూడా చూసింది లేదు. కానీ, ఈ దఫా.. పక్కా మాస్ అవతారం ఎత్తిన ముఖ్యమంత్రి.. ప్రజలకు చేరువయ్యేందుకు, వారిని పలకరించడంతోపాటు.. వారితో తాను మమేకం అవుతున్నారు. వాస్తవానికి కల్లు గీత కార్మికులను కలుసుకునే కార్యక్రమం షెడ్యూలో లేకపోయినా.. ఆయన వారితో అరగంటకుపైగానే ముచ్చటించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates