ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో ఇకపై ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగానే ఉంటారని, ఇకపై కాంట్రాక్టు ఉద్యోగులన్నమాటే వినిపించదని ఆప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ కేబినెట్ రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మాన్ సర్కారు తీసుకున్న ఫలితంగా పంజాబ్ లోని 51 ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు పద్దతిన పనిచేస్తున్న 65,048 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు.
ఆయా ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు పద్దతిన 5 ఏళ్లకు మించి పనిచేసిన వారంతా ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడతారని ఈ సందర్భంగా మాన్ సర్కారు తేల్చి చెప్పింది. పంజాబ్ అవుట్ సోర్స్ డ్ బిల్లు 2026 పేరిట కేబినెట్ ఆమోదం పొందిన ఈ చట్టంతో కాంట్రాక్టు ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారడంతో పాటుగా ప్రభుత్వ ఉధ్యోగులకు మాదిరిగా అన్ని ప్రభుత్వ సదుపాయాలకు అర్హత పొందుతారు.
రోజువారీ విధుల్లో భాగంగా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే అగ్నిమాపక శాఖ, పీఎస్ పీఎల్ లైన్ మన్, పట్టణ, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మూడేళ్ల కాంట్రాక్ట్ పూర్తి చేసిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతారని ఈ బిల్లు చెబుతోంది.
ఈ కొత్త బిల్లు గురించి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్వయంగా ఈ విషయాలను మీడియాకు వివరించారు. కేబినెట్ భేటీ అనంతరం నేరుగా మీడియా సమావేశానికి వచ్చిన మాన్.. రాష్ట్రంలో ఇకపై కాంట్రాక్ట్ బేసిస్ కింద పనిచేసే కార్మికులు ఉండబోరని ఆయన ప్రకటించారు.
తమ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్టు కార్మికులకు లబ్ధి చేకూరనుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఇకపై ఆయా విభాగాల్లో కాంట్రాక్టు పద్దతిన పనికి కుదిరే కార్మికులు నిర్ణీత కాలం పనిచేయగానే… నేరుగా ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతారని కూడా ఆయన ప్రకటించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates