వైసీపీ మెడకే చుట్టుకున్న వైఎస్ విగ్రహ ధ్వంసం!

ఏపీలోని నంద్యాల జిల్లా కేంద్రం నంద్యాలలో సెలవు దినం ఆదివారం రాజకీయ రచ్చ చోటుచేసుకుంది. పట్టణంలోని శ్రీనివాస సెంటర్ లో ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. పట్టపగలే… అందరూ చూస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

విగ్రహాన్ని ద్వంసం చేసిన వ్యక్తి పేరు జమ్ములయ్య అని, అతడు వైసీపీ నేతలకు అనుచరుడు అని నిర్ధారణ అయ్యిందని టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ తెలిపారు. వెరసి వైఎస్ విగ్రహం ధ్వంసమైన ఘటన ఇప్పుడు వైసీపీ మెడకే చుట్టుకుందని చెప్పక తప్పదు.

ఆదివారం ఉదయం జమ్ములయ్య మద్యం మత్తులో జోగుతూ శ్రీనివాస సెంటర్ లోని వైఎస్ విగ్రహాన్ని చేరుకున్నాడు. విగ్రహం పక్కనే ఉన్న భవనాల సాయంతో అతడు అక్కడకు చేరుకుని విగ్రహం తల భాగాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఘటన జరుగుతున్నప్పుడు స్థానికులంతా చూస్తూనే ఉన్నారు.

వైఎస్ విగ్రహం ధ్వంసానికి గురైందన్న వార్త క్షణాల్లో తెలుగు నేల వ్యాప్తంగా వ్యాపించింది. రాయలసీమలో ప్రధానమైన నంద్యాల జిల్లాలో… అది కూడా వైసీపీకి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంచి పట్టు కలిగిన నంద్యాలలో వైఎస్ విగ్రహం ధ్వంసం కావడం నిజంగానే సంచలనంగా మారింది. ఈ ఘటనపై ముందుగా వైసీపీ స్పందిస్తుందని అంతా భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వైఎస్ విగ్రహం ధ్వంసంపై అధికార టీడీపీ, ఆ పార్టీ కీలక నేత లోకేశ్ స్పందించడం గమనార్హం.

వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి వైసీపీకి చెందిన నేతల అనుచరుడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని ఈ సందర్భంగా లోకేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా దొంగ నాటకాలు ఆడుతున్న వైసీపీ ఇప్పటికైనా తన డ్రామాలను కట్టిపెట్టాలని ఆయన ఒకింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీని గొడ్డలి పార్టీ అని సంబోధించిన టీడీపీ… ఇకనైనా గొడ్డలి పార్టీ తన డ్రామాలను ఆపాలని డిమాండ్ చేసింది.

జమ్ములయ్య గత కొన్నేళ్లుగా మానసిక వ్యాదితో బాధపడుతున్నాడని స్థానిక పోలీసులు తెలిపారు. ఇటీవలే తన కుమార్తె కూడా మానసిక వ్యాధి నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడగా… అప్పటి నుంచి జమ్ములయ్య మానసిక పరిస్థితి మరింత దిగజారినట్టుగా పోలీసులు చెబుతున్నారు. తమ ప్రాథమిక విచారణలో జమ్ములయ్య వైసీపీ కార్యకర్తేనని తేలిందని కూడా వారు చెప్పారు.

ఇదిలా ఉంటే… వైఎస్ విగ్రహ ధ్వంసంపై వైఎస్ తనయ, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా స్పందించారు. వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తుంటే… కూటమి సర్కారు చూస్తూ అలా నిలుచుండిపోయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్న పోలీసులు ఈ దారుణాన్ని ఆపాల్సింది పోయి ప్రేక్షక పాత్ర పోషించారని ఆమె తప్పుబట్టారు. ధ్వంసం అయిన వైఎస్ విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన షర్మిల… లేని పక్షంలో విగ్రహం ధ్వంసం అయిన చోటే తాను ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు.