రండి తేల్చేద్దాం.. ముఖ్య నేత‌ల‌కు చంద్ర‌బాబు పిలుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. గ‌త వారం రోజులుగా మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌పై దృష్టి పెట్టారు. ఇదేస‌మ‌యంలో పాల‌న ప‌రంగా కూడా స‌మీక్ష‌లు.. స‌మావేశాలు నిర్వ‌హించారు. ఇక‌, మ‌హానాడు విజ‌య‌వంతంగా ముగిసింది. ఇప్పుడు దీనికి మించిన కార్య‌క్ర‌మం చంద్ర‌బాబు ముందు ఉంది. అదే.. రాజ్య‌స‌భ స‌భ్యుల ఎంపిక‌. మ‌రో మూడు రోజుల్లోనే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ రానుంది.

మొత్తం 10 రాష్ట్రాల్లోని 26 రాజ్య‌స‌భ స్థానాల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది. వీటిలో 4 స్థానాల‌కు ఏపీకి చెందినవే ఉన్నాయి. పైగా.. ఈ నాలుగుస్థానాలు కూడా.. అధికార కూట‌మి పార్టీల‌కే ద‌క్క‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో మెజారిటీ స్థానాలు గెలుచుకున్న టీడీపీ ఈ విష‌యంపై తీసుకునే నిర్ణ‌యం కీల‌కంగా మారింది. అయితే.. 4 స్థానాలే ఖాళీ అవుతున్నా.. పోటీలో మాత్రం 12-15 మంది అభ్యర్థులు ఉన్నారు.

దీనికితోడు.. మిత్ర‌ప‌క్షాలైన జ‌న‌సేన‌, బీజేపీల‌కు కూడా సీట్లు కేటాయించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. జ‌న‌సేనకు ఒక‌టి, బీజేపీకి ఒక స్థానం ఇచ్చి.. మిగిలిన రెండు స్థానాల‌ను టీడీపీ తీసుకుంటుంద‌ని ఒక చ‌ర్చ న‌డుస్తుండ‌గా.. బీజ‌పీకి ఈ సారి ఇవ్వ‌బోర‌ని కూడా అంటున్నారు. ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ ప‌రిణామాల క్ర‌మంలో చంద్ర‌బాబు కీల‌క స‌మావేశానికి రెడీ అయ్యారు. జ‌న‌సేన పార్టీ నుంచి కీల‌క నాయ‌కుల‌తోపాటు.. బీజేపీ, టీడీపీల నుంచి కూడా నాయ‌కుల‌ను పిలిచారు.

వీరితో చ‌ర్చించి.. ఎవ‌రెవ‌రికి టికెట్లు ఖ‌రారు చేస్తార‌న్న విష‌యాన్ని నిర్ణ‌యించ‌నున్న‌ట్టు తెలిసింది. నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌య్యే జూన్ 1వ తేదీ నాటికే.. దీనిపై ఒక నిర్ణ‌యం తీసుకుంటార‌ని స‌మాచారం. ఎంతో మంది నాయ‌కులు రాజ్య‌స‌భ‌కు వెళ్లాల‌ని భావిస్తున్నా.. ప్ర‌స్తుత అవ‌స‌రాలు.. రిజ‌ర్వేష‌న్లు.. స‌హా.. ఇత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఈ క్ర‌మంలో తాజా స‌మావేశానికి ప్రాధాన్యం ఏర్ప‌డింది.