2029 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం ఇవ్వబోమని టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ పార్టీని పాతాళానికి పాతి పెడతామని ఆయన ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికలకు ముందు ప్రజలకు మాయ మాటలు చెప్పి, అబద్ధాలతో జగన్ అధికారంలోకి వచ్చారని ఆయన ఆరోపించారు. ఈసారి ప్రజలకు ఏది నిజమో, ఏది అబద్ధమో చెప్పేందుకు తమ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ప్రజలను నిరంతరం కలుసుకుని జగన్ మాయ మాటలను విడమర్చి చెబుతారని, తద్వారా వైసీపీకి మరో అవకాశం దక్కకుండా చూస్తామని అచ్చెన్న అన్నారు. మహానాడు వేదికపై ఆయన మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు ప్రారంభించామని చెప్పారు. వాటిని వైసీపీ అధికారంలోకి రాగానే తొలగించిందని తెలిపారు.
పేదలకు అన్నం పెట్టడాన్ని కూడా జగన్ సహించలేకపోయారని ఆయన దుయ్యబట్టారు. పెట్టుబడులు తీసుకురావడాన్ని కూడా ఓర్వలేకపోయారని, 2014 నుంచి 2019 మధ్య వచ్చిన పెట్టుబడులను పద్ధతిగా తరిమేశారని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై శాసనసభలో, మండలిలో ఎన్నోసార్లు నచ్చజెప్పామని గుర్తు చేశారు.
అయితే తమ మాటలను పట్టించుకోకుండా పెట్టుబడిదారుల్లో భయం కలిగించేలా వ్యవహరించారని అన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టుబడిదారులకు భరోసా వచ్చిందని చెప్పారు.
రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా, పెట్టుబడులు రావాలన్నా కూటమి ప్రభుత్వం కొనసాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్యకు తీసుకెళ్తారని చెప్పారు. వైసీపీకి, జగన్కు మరో అవకాశం లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి రావడం ఇక జగన్కు సాధ్యం కాదని అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates