కాపు నేతలకు పవన్ ఓపెన్ ఛాలెంజ్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గడచిన రెండు రోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ సాగుతున్నారు. ప్రభుత్వ పరంగానే కాకుండా రాజకీయాల పరంగానూ పవన్ నోట నుంచి నిజంగానే సంచలన వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్ల పరిశీలన కోసం ఆదివారం రాత్రి రాజమహేంద్రవరం చేరిన పవన్… సోమ, మంగళవారాల్లో పనులను పరిశీలించారు. ఈ రెండు రోజుల్లో సాయంత్రం అయ్యేసరికి ఆయన పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తూ సాగారు. మంగళవారం నాటి సమావేశంలో తన సొంత సామాజిక వర్గం నేతలకు ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరి సంచలనం రేపారు.

ఓ కులానికి మద్దతుగా తాను రాజకీయాల్లోకి రాలేదని ఆది నుంచి పవన్ కల్యాణ్ చెబుతూనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు మాత్రం ఆయనపై విమర్శలు సంధిస్తూనే ఉన్నారు. ఈ తరహా పరిస్థితిపై చాలా కాలంగా మౌనంగానే సాగిన పవన్… మంగళవారం మాత్రం బరస్ట్ అయిపోయారు. కాపు నేతలను ఉద్దేశించి ఆయన నేరుగానే సంచలన వ్యాఖ్యలు చేశారు. మీలో మీరే చర్చించుకుని ఓ కాపు నేతను సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసుకుని ఆ నేతను సీఎంగా గెలిపించుకోండి అని ఆయన సవాల్ విసిరారు.

ఒకే ఒక్క కులం కోసం రాజకీయం చేయడం సాధ్యమేనా? అని ప్రశ్నించిన పవన్… అలా చేస్తే ఇతర కులాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తన వెంట లింగమనేని రమేశో, నాదెండ్ల మనోహరో ఉంటే.. వారిని కమ్మ కులస్తులు అని అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే తన వెంట ఇతర కులాలకు చెందిన వారు ఉండకూడదా? అని కూడా పవన్ ప్రశ్నించారు. అలాగైతే రాజకీయాలు చేయడం ఎలా? అని కూడా పవన్ కాపులను నిలదీశారు.

నోరు తెరిస్తే వంగవీటి రంగాను బయటకు లాగుతారన్న పవన్… రంగా బతికున్నప్పుడు ఈ నేతలంతా ఎక్కడికెళ్లారని ప్రశ్నించారు. రంగా గారి సతీమణి ఓ కమ్మ కుస్తురాలు కాదా? అని ఆయన ప్రశ్నించారు. కాపులు ప్రత్యేకించి వైసీపీలోని కాపు నేతలు ఈ తరహా వివాదాలను అధికంగా తీసుకుని వస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగా గారి విషయంలో కాపుల వైఖరి సరికాదని పవన్ తేల్చి చెప్పారు.

కాపులకు, ఇతర కులాలకు చెందిన నేతల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా పవన్ సోదాహరణంగా వివరించారు. జగన్ సామాజిక వర్గానికి చెందిన నేతలు జగన్ ఓడిపోతే… తమ పేరు మార్చుకుంటామని ఏనాడైనా ప్రమాణం చేశారా? అని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబు సామాజిక వర్గంలోనూ ఈ తరహా సంస్కృతి లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఒక్క కాపుల్లోనే మీరు ఓడిపోతే పేరు మార్చుకుంటామంటూ శపథాలు చేస్తారని ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్య ద్వారా ఆయన కాపు నేత ముద్రగడ పద్మనాభం చేసిన శపథం, పేరు మార్చుకున్న తీరును పవన్ నేరుగానే ప్రశ్నించినట్టు అయ్యిందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.