ఏపీలో అధికార కూటమి రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) తన వార్షిక వేడుక మహానాడు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. బుధవారం మొదలుకానున్న ఈ వేడుక రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది. ఏటా ఏదో ఒక ప్రాంతంలో తెలుగు నేల నలుమూలల నుంచి తరలివచ్చే లక్షలాది మంది టీడీపీ కార్యకర్తల సమక్షంలో జరిగే ఈ వేడుక… ఈ సారి మాత్రం హైబ్రిడ్ పద్ధతిలో జరుగుతోంది. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు పాటిస్తూ మహానాడును ఈ దఫా ఆన్ లైన్ వేదికగా నిర్వహిద్దామన్న పార్టీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని యావత్తు పార్టీ కేడర్ ఆహ్వానించింది.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులతో జరిగే ఈ వేడుకలను రాష్ట్రం మొత్తం క్లస్టర్ల వారీగా ఏర్పాటు చేస్తున్న బిగ్ స్క్రీన్ల ద్వారా ప్రసారం చేస్తారు. ఆయా గ్రామాల పార్టీల కార్యకర్తలు తమ క్లస్టర్ కేంద్రాలకు చేరుకుని మహానాడు వేడుకలను తిలకిస్తారు. అధునాతన సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడంలో అందరికంటే ముందు ఉండే చంద్రబాబు…ఈ దఫా మహానాడును హైబ్రిడ్ వేదికగా జరపాలని నిర్ణయించిన తీరు నిజంగానే ఆహ్వానించదగ్గదని చెప్పాలి.
ఇక ఈ మహానాడు వేడుకకు చాలా ప్రత్యేకతలున్నాయని చెప్పాలి. తొలిసారి హైబ్రిడ్ వేదికగా జరుగుతున్న మహానాడు ఇదేనట. అంతేకాకుండా పార్టీ కీలక నేత, మంత్రి నారా లోకేశ్ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఇదే. ఈ కారణంగా ఈ వేడుకలను పార్టీ శ్రేణులు అత్యంత ప్రత్యేకమైనవిగా భావిస్తున్నాయి.
పార్టీలో మూడో తరం నేత పార్టీలో ఓ కీలక స్థాయిని అందుకున్న తర్వాత జరుగుతున్న ఈ వేడుకల సందర్భంగా విజయవాడకు చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఓ ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. మంగళగికి సమీపంలో కృష్ణా నది తీరంలో సీతమ్మ వారి పాదాల చెంత ఆయన ఓ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. పార్టీలో మూడు తరాల నేతలు ఎన్టీఆర్, చంద్రబాబు… వారిలో నుంచి దూసుకువస్తున్న నారా లోకేశ్ ఫొటోలతో కూడిన ఈ కటౌట్ ఎత్తు 150 అడుగులట. దీని కోసం వెంకన్న ఏకంగా రూ.18 లక్షలు వెచ్చించారట. ఈ కటౌట్ అందరినీ ఆకట్టుకోవడం ఖాయమేనని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates