ఈ సారికి డీకేకు ఆ యోగం లేదట!

కన్నడ రాజకీయం గత రెండు రోజులుగా హీటెక్కినట్టే ఎక్కి… మంగళవారం ఒక్కసారిగా చల్లబడిపోయింది. కర్ణాటక డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ ఈ సారైనా సీఎం యోగం వరిస్తుందా? అన్న దిశగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో వాడీవేడీ చర్చ జరగగా… ఈ సారికి డీకేకు సీఎం అయ్యే యోగం లేదని ఆ పార్టీ అధిష్ఠానం తేల్చి పారేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం సాయంత్రం ఓ విస్పష్ట ప్రకటన చేశారు.

2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండో సారి విజయం సాధించగా… పార్టీ విజయానికి కృషి చేసిన డీకే శివకుమార్ కే సీఎం పోస్టు ఇవ్వాలంటూ మెజారిటీ వర్గం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సిట్టింగ్ సీఎంగా ఎన్నికలకు వెళ్లిన సిద్ధరామయ్య…తన వయసు అయిపోవచ్చిందని, ఈ సారి కూడా తానే సీఎంగా ఉంటానని పట్టుబట్టారు.

ఈ నేపథ్యంలో డీకే, సిద్ధరామయ్యలకు చెరో రెండున్నరేళ్ల పాటు సీఎం పదవి ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని వార్తలు వినిపించాయి. అయితే ఆ ఒప్పందాన్ని అమలు చేయడం కాంగ్రెస్ అధిష్ఠానానికి సాధ్యం కావడం లేదని తాజాగా తేలిపోయింది.

సిద్ధరామయ్యకి ఇచ్చిన రెండున్నరేళ్ల సమయం ముగిసిందని, ఇంకో ఆరు నెలల సమయం కూడా అయ్యిందని డీకే వర్గం అధిష్ఠానం వద్ద మొరపెట్టింది. దీంతో పరిస్థితి చేజారకూడదని భావించిన అధిష్ఠానం పెద్దలు… డీకేతో పాటు సిద్ధరామయ్యనూ ఢిల్లీకి పిలిపించారు.

ఈ వార్త విన్నంతనే డీకే ఇక సీఎం అయిపోయినట్టేనని ఆయన వర్గం భావించింది. అదే సమయంలో సిద్ధరామయ్య శకం ముగిసినట్టేనని ఆయన వర్గం ఒకింత బాధ పడింది. అయితే ఢిల్లీలో తనకే అనుకూలంగా అధిష్ఠానం నిర్ణయం తీసుకునేలా సిద్ధరామయ్య తనదైన శైలిలో పావులు కదిపినట్లు సమాచారం.

సిద్ధరామయ్య, డీకేలతో సుదీర్ఘ భేటీ జరిపిన కాంగ్రెస్ పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు దాదాపుగా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి సమగ్ర చర్చలు జరిపారు. భేటీ అనంతరం మంగళవారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చిన కేసీ వేణుగోపాల్… కర్ణాటక సీఎం మార్పు లాంటిదేమీ లేదని తేల్చి పారేశారు.

అంతేకాకుండా ఈ టెర్మ్ సిద్ధరామయ్య సీఎంగా, డీకే శివకుమార్ డిప్యూటీగా కొనసాగుతారని ప్రకటించారు. అంతేకాకుండా ఈ భేటీలో రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఖరారుపైనే చర్చలు జరిపామని, సీఎం మార్పు అంశం అసలు ప్రస్తావనకే రాలేదని కూడా ఆయన పేర్కొన్నారు.