‘త్వరలో నీ టైం కూడా వస్తుందబ్బా!’

ఏపీలో రాజకీయం అంతకంతకూ వేడెక్కుతోంది. అధికార కూటమి పార్టీలను విపక్షం వైసీపీ తూలనాడుతూ ఉంటే… వైసీపీని అధికార కూటమి పార్టీలూ అంతే స్థాయిలో విమర్శిస్తున్నాయి. వైసీపీ పాలనలో ఏం జరిగిందన్న అంశాలను బయటకు తీస్తున్న కూటమి పార్టీలు వైసీపీని, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నేరుగానే టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్లు చేస్తున్నాయి.

తాజాగా శుక్రవారం జగన్ సొంత జిల్లా కడపలోని జమ్మలమడుగు వెళ్లిన టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఓ రేంజిలో విపక్షానికి వార్నింగులిచ్చారు. త్వరలో నీ టైం కూడా వస్తుందంటూ ఆయన చేసిన వార్నింగ్… జగన్ గురించే లోకేశ్ ఈ వ్యాఖ్య చేశారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

టీడీపీ విపక్షంలో ఉండగా… నాటి వైసీపీ సర్కారు దుర్మార్గ పాలన సాగిస్తోందంటూ లోకేశ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా టీడీపీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేసిన వారి పేర్లను రాసేందుకు తాను రెడ్ బుక్ ను ఏర్పాటు చేసుకున్నానని చెప్పిన లోకేశ్.. అందులో పేరున్న ప్రతి ఒక్కరికీ టీడీపీ అదికారంలోకి రాగానే తగిన రీతిలో బుద్ధి చెబుతామని నాడే హచ్చరించారు. లోకేష్ అనుకున్నట్లుగానే టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకుంది. ఈ క్రమంలో వైసీపీ జమానాలో చట్టాన్ని ఉల్లంఘించిన వారిలో ఒక్కొక్కరికీ కూటమి సర్కారు చుక్కలు చూపించింది.

తాజాగా జమ్మలమడుగులో ఇదే అంశాన్ని ప్రస్తావించిన లోకేశ్…త్వరలోనే నీ టైం కూడా వస్తుందంటూ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. కడప జిల్లాలో ఓ ఎమ్మెల్యే ఉన్నారని, ఆయనకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని లోకేశ్ అన్నారు. ఆ సమయంలో ఎవరు అడ్డుకున్నా వినేది లేదని కూడా లోకేశ్ చెప్పుకొచ్చారు.

ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో… వారిలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఫలానా వ్యక్తి బావ అని, ఫలానా వ్యక్తి బాబాయి అని వెళితే… ఆ వ్యక్తులు కూడా వారిని కాపాడలేరని ఆయన తెలిపారు. త్వరలో నీ టైం కూడా వస్తుందబ్బా అని లోకేశ్ చేసిన వ్యాఖ్యతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.