నోటాతో పోటిపడ్డ నేతకు జగన్ రెడ్ కార్పెట్

ఏపీలో ప్రదాన ప్రతిపక్ష హోదానూ దక్కించుకోలేకపోయిన వైసీపీ… తన పునరాగమనానికి భారీ కసరత్తే చేస్తోంది. అందులో భాగంగా ఏ చిన్న అవకాశం అందివచ్చినా దానిని తనదైన శైలిలో వాడుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గానికి సంబంధించి వైసీపీలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన దేవినేని శ్రీనివాసరావు తన అనుచరవర్గంతో కలిసి గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా మోపిదేవికి వైసీపీ కండువా కప్పిన జగన్… ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జగన్… మోపిదేవికి ఓ రేంజిలో ఎలివేషన్ ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచి పార్టీలో చేరుతున్న మోపిదేవికి తాను తప్పకుండా న్యాయం చేస్తానని, భవిష్యత్తులో వైసీపీ అదికారంలోకి వస్తే… మోపిదేవికి తప్పనిసరిగా తగిన గుర్తింపు ఇస్తూ కీలక పదవి అప్పగిస్తానని తెలిపారు. అయితే రేపల్లె అసెంబ్లీ టికెట్ మాత్రం మోపిదేవికి ఇచ్చేది లేదని తేల్చేసిన జగన్… ప్రస్తుతం రేపల్లె వైసీపీ కన్వీనర్ గా కొనసాగుతున్న మోహన కృష్ణను గెలిపించాల్సిన బాధ్యత మోపిదేవిపైనే ఉందని తెలిపారు. ఈ మాట ద్వారా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేది లేదని మోపిదేవికి జగన్ నేరుగానే చెప్పినట్టైంది.

ఇక మోపిదేవి శ్రీనివాసరావు విషయానికి వస్తే… ఇంటిపేరులో మోపిదేవి ఉండటంతో ఆయన మాజీ మంత్రి, జగన్ కే కాకుండా వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడిన మోపిదేవి వెంకటరమణకు సమీప బంధువన్న ప్రచారం సాగుతోంది.

ఈ విషయంలో ఏ మేర వాస్తవముందన్న విషయాన్ని పక్కనపెడితే… శ్రీనివాసరావు గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రేపల్లె నుంచే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నోటాకు 1,891 ఓట్లు పోలయితే… నోటాకు పోటీ అన్నట్లుగా శ్రీనివాసరావుకు కేవలం 2,841 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇలాంటి నేతకు జగన్ రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నారన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.