దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీల కాలపరిమితి.. గత 2 నెల కిందటే ముగిసింది. ఇక, స్థానిక సంస్థల అధికారం కూడా గతనెలలోనే ముగిసింది. దీంతో ప్రత్యేక అధికారుల పాలనలో మునిసిపాలిటీలు.. గ్రామ పంచాయతీలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత వేగంగా ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల హైకోర్టు తేల్చి చెప్పింది.
ఈ పరిణామాల క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల అధికారులు కూడా సమాయత్తం అవుతున్నారు. అయితే.. స్థానిక ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్ పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ను కూడా వేసింది.
ప్రస్తుతం ఈ కమిషన్ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. రాష్ట్రంలో బీసీలకు ఇప్పుడు అందుతున్న రిజర్వేషన్ ఫలాలు.. మరింతగా అమలు చేయాల్సిన అంశాలపై అధ్యయనం సాగుతోంది. ఈ కమిషన్ కేవలం 45 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం గడువు విధించింది.
ఈ గడువుకూడా ఈ నెల 20 నాటికి ముగియనుంది. ఈ నేపథ్యంలో కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేయాలని సర్కారు యోచిస్తోంది. దీనికితోడు.. మహిళలకు పెద్ద సంఖ్యలో రిజర్వేషన్ కల్పించాలని కూడా ప్రయత్ని స్తున్నారు.
ఈ రెండు ప్రక్రియలపై ప్రభుత్వం కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. కొన్ని అవాంతాలు ఏర్పడతాయన్న అంచనా ఉన్నప్పటికీ.. అనుకున్న విధంగా రిజర్వేషన్ను అమలు చేయాలని నిర్ణయించింది. దీనిపై స్పష్టమైన వైఖరి ఉండడంతో ప్రభుత్వం నుంచి ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారులు ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేశారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా, పోలింగ్ బూత్ల ఏర్పాటు.. ఈవీఎంలు..(ఈసారి ఈవీఎంలపై నిర్వహించాలని నిర్ణయించారు).. అధికారుల వెసులు బాటు ఇలా.. అనేక కోణాల్లో అధికారులు ఎన్నికల ప్రక్రియపై దృష్టిపెట్టారు.
వచ్చే వారంలోగా.. ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన ప్రకటన వస్తుందని అంచనా వేస్తున్నారు. దీనిని బట్టి మరో రెండు లేదా మూడు నెలల్లో రాష్ట్రంలో తొలుత గ్రామ పంచాయతీయలకు ఎన్నికలు నిర్వహిస్తారు. తర్వాత.. స్తానిక సంస్థలకు ఎన్నికలు ఉండనున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates