వైన్ షాపు వద్ద డిసిప్లైనా… ఊరుకో గురూ !

వీఐపీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. పనీ పాటా లేకుండా ఖాళీగా తిరిగే హీరోని పట్టుకుని ఈరోజు నువ్వు ఫ్రీగా ఉన్నావా అని అడుగుతుంది. నువ్వు ఎవరి దగ్గరకొచ్చి ఏమడుగుతున్నావని హీరో నవ్వుతాడు. అలాగే ఉంది ఏపీ పరిస్థితి.

40 రోజులు తర్వాత వైన్ షాపు ఓపెన్ చేసి… క్యూలో ఉండండి, ఐదుగురే రండి, మాస్కుపెట్టుకోండి, క్రమశిక్షణ తో ఉండండి అంటే… ఎవరి దగ్గరకొచ్చి ఏం చెప్తున్నావు అన్నట్లుంది వారి వ్వవహారం. మందు కోసం ఆబగా ఎదురుచూస్తున్న మందు బాబులు షాపులు తెరవకనే తత్కాల్ టిక్కెట్ల కోసం క్యూలో ఉన్న ప్రయాణికుల్లా పోటెత్తారు. కొందరు మాత్రమే మొహానికి టవల్ చుట్టుకున్నారు.

సామాజిక దూరం, మాస్కు, ఐదు మందే వంటి క్రమ శిక్షణ ఏమీ ఎక్కడా కనపడటం లేదు. ఇది కేవలం ఆంధ్ర మాత్రమే కాదు…. దేశమంతటా సీన్స్ ఇలాగే ఉన్నాయి. ఎక్కడ మాకు దొరక్కుండా పోతుందో అన్న ఆందోళన తప్ప, కరోనా వస్తుందన్న ఆందోళన వారిలో ఎవరిలోను లేదు. ఒకటి రెండు చోట్ల తప్ప చాలా ప్రాంతాల్లో ఎటువంటి సామాజిక దూరం పాటించడం లేదు. కరోనాకు ముందు ఎగబడిన్లే ఎగబడుతున్నారు. వారిని కంట్రోల్ చేయాలంటే ఉన్న పోలీసులు అందరూ వాటి వద్దే సరిపోతారు. అందుకే పెద్దగా పోలీసులను పెట్టడానికి కుదరడం లేదు. అపుడపుడు పెట్రోలింగ్ వాళ్లు వచ్చి క్యూలు పెట్టించి పోతున్నారు. నిమిషాల్లో వారిలో క్రమశిక్షణ తప్పుతోంది. గ్రీన్ జోన్లలో పర్వాలేదు గాని… ఆరెంజ్, రెండ్ జోన్లలో కచ్చితంగా ఇది ప్రమాదకరమైన స్థాయిలో కరోనా వ్యాప్తి చేసే ప్రమాదం లేకపోలేదు.

వాస్తవానికి మద్యం అమ్మడం ఈ సమయంలో రాష్ట్ర ఖజానాకు మంచిదే. సులువుగా ఆదాయం సంపాదించి భారతం తగ్గించే అవకాశం ఉంది. కానీ దానివల్ల జరిగే నష్టం రాష్ట్రానికి కోలుకోలేని నష్టం చేస్తుందా అన్న భయం కూడా జనాల్లో పెరుగుతోంది. ఎక్కడ చూసినా భారీ క్యూలు ఉన్నాయి. కిలోమీటర్ల కొద్దీ జనం పడిగాపులు కాసే పరిస్థితి. ఎపుడైనా తెరచి ఉంటారు కాబట్టి మెల్లగా కొనుక్కుందాం అని తాపీగా ఎవరూ కనిపించడం లేదు. అసలే 40 రోజుల నుంచి మందు లేకపోవడంతో ఎంతో ఆశగా మొదటి రోజే మందు దక్కించుకోవాలని భారీగా ఎగబడుతున్నారు.

అయితే చాలామంది ఈ మద్యం షాపులు ఇపుడే ప్రారంభించడాన్ని విమర్శిస్తున్నారు. ఎవరు దేనికోసం బయటకు వస్తున్నారో మీరు ఎలా కనిపెడతారు. మద్యం ఓపెన్ చేయడం వల్ల ఎవరైనా లిక్వర్ కోసం అని చెప్పి బయట తిరిగే ప్రమాదం లేకపోలేదు కదా.

పైగా కిరాణా దుకాణాలు, కూరగాయలు కేవలం 3 గంటల పాటు ఓపెన్ చేసి మద్యం మాత్రం 11 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఓపెన్ చేయడంపై ఏపీ సర్కారును తప్పు పడుతున్నారు. మరి మొదటి రోజు కాబట్టి నిబంధనలు పాటించని దుకాణాలపై ఎలాంటి చర్యలు మార్గదర్శకాలు ఉంటాయో వేచిచూడాలి.