తమిళనాడు రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించిన టీవీకే అధినేత విజయ్ కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అనూహ్యంగా షాకిచ్చిన సంగతి తెలిసిందే. టీవీకేకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడా సభ్యులు తీసుకువస్తేనే అనుమతినిస్తానని ఆయన తేల్చి చెప్పారు.
అయితే, తాజాగా నేడు మరోసారి గవర్నర్ రాజేంద్రను కలిసేందుకు విజయ్ లోక్ భవన్ కు వెళ్లిన విజయ్ కు మరోసారి షాక్ తగిలింది. నేడు కూడా విజయ్ కు గవర్నర్ రాజేంద్ర నో చెప్పారు. ఎమ్మెల్యేల లెక్క చూపాలని విజయ్ ను ఆయన కోరారు. విజయ్ రిక్వెస్ట్ కు ఆయన సానుకూలంగా స్పందించలేదు.
అయితే, విజయ్ కు ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపై గవర్నర్ రాజేంద్ర న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారు. దీంతో, తమిళనాట రాజకీయాలు ఉత్కంఠగా మారాయి.
ఈ క్రమంలోనే గవర్నర్ వ్యవహార శైలిని కోలీవుడ్ లెజెండరీ యాక్టర్, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తప్పుబట్టారు. 108 సీట్లు గెలిచిన టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకపోవడం ప్రజా తీర్పును అవమానించడమేనని కమల్ విమర్శించారు.
సంఖ్యాబలం నిరూపించుకోవాల్సింది అసెంబ్లీలో అని, లోక్ భవన్ లో కాదని కమల్ అన్నారు. ప్రజా తీర్పును గౌరవించి ప్రతిపక్షంలోనే ఉంటానని స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తానని అన్నారు. అదే సమయంలో స్టాలిన్ రాజకీయ పరిణితిని ప్రశంసించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates