దేశంలో కమ్యూనిజం సిద్ధాంతాలను బలోపేతం చేసిన కమ్యూనిస్టు పార్టీలు.. తాజా ఎన్నికలతో కనుమరుగయ్యాయి. ప్రజా పాలనలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సీపీఐ, సీపీఎం పార్టీలు.. పలు రాష్ట్రాల్లో అధికారం చలాయించాయి. అయితే.. ఒక్కొక్క దశలో ఎదురైన అనేక సంఘర్షణల కారణంగా కాలానికి అనుగుణంగా దూసుకుపోయే తత్వాన్ని అలవరుచుకోని కామ్రెడ్లు.. ప్రజా క్షేత్రంలో తమను తామే ఓడించుకుని.. అధికారానికి దూరమయ్యారు. తాజాగా కేరళలో ఎల్డీఎఫ్ కూటమి సైతం ఓటమి పాలవడంతో దేశంలో ఎక్కడా కమ్యూనిస్టుల ప్రభుత్వం లేకుండా పోయింది. మొత్తం 36 రాష్ట్రాల్లో ఎక్కడా కమ్యూనిజం ప్రభావం కూడా కనిపించకపోవడం గమనార్హం.
ఒకప్పుడు అప్రతిహతం.. నేడు హతం!
1980వ దశకంలో, సీపీఐ(ఎం) నేతృత్వంలోని వామపక్ష పార్టీలు కేరళ, త్రిపుర, పశ్చిమ బెంగాల్లను ఏకకాలంలో పాలించాయి. లోక్సభలోనూ సత్తా చాటాయి. 2004లో 60కి పైగా సీట్లు గెలుచుకుని అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. భారత్-అమెరికా అణు ఒప్పందంపై లోక్సభలో దాదాపు 60 మంది ఎంపీలు ఉన్న వామపక్ష కూటమి మద్దతు ఉపసంహరించుకోవడంతో, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కోవలసి వచ్చింది. ఇది అప్పట్లో పెను సంచలనంగా మారింది.
పశ్చిమ బెంగాల్లో 1977 నుండి 2011 వరకు వామపక్ష కూటమి అధికారంలో ఉంది. ఈశాన్య రాష్ట్రం త్రిపురను 1993 నుండి 2018 వరకు పాలించింది. ఇక, కేరళలో ప్రతి ఐదేళ్లగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ తాజా ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. 1977లో పశ్చిమ బెంగాల్లో సీపీఐ(ఎం) అధికారంలోకి వచ్చింది. తద్వారా ఏ రాష్ట్రంలోనైనా ఏ పార్టీకి దక్కని సుదీర్ఘ నిరంతర పాలనకు నాంది పలికింది. జ్యోతి బసు 23 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2000లో బుద్ధదేబ్ భట్టాచార్య సీఎం అయ్యారు. ఆ తర్వాత వామపక్షాలు మరో 11 సంవత్సరాల పాటు బెంగాల్ను పాలించాయి.
త్రిపురలో
ఈశాన్య రాష్ట్రం త్రిపురలో 1993 నుండి 2018 వరకు వామపక్షాలు అధికారం దక్కించుకున్నాయి. 1993లో రాష్ట్రంలో వామపక్షాలు ఘనవిజయం సాధించాయి. అసెంబ్లీలోని 60 స్థానాలకు గాను సీపీఐ(ఎం) ఒక్కటే 44 స్థానాలను గెలుచుకుంది. 1998 వరకు దశరథ్ దేబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత మాణిక్ సర్కార్ బాధ్యతలు స్వీకరించి 20 సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగారు. త్రిపురలో 25 ఏళ్ల వామపక్ష కూటమి పాలన 2018లో బీజేపీ అనూహ్యంగా ఓడించడంతో ముగిసింది. 2023లో బీజేపీ విజయాన్ని పునరావృతం చేసింది.
కేరళలో..
కేరళలో సీపీఐ(ఎం) పేలవమైన ప్రదర్శనతో వామపక్షాల చివరి కంచుకోట కూలిపోయింది. ప్రస్తుత ఓట్ల లెక్కింపు సరళి ప్రకారం, ఈ దక్షిణ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ సునాయాసమైన ఆధిక్యాన్ని సాధించింది. 2016లో అధికారంలోకి వచ్చిన పినరయి విజయన్ నేతృత్వంలోని సీపీఐ(ఎం) లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయింది. 1977 తర్వాత తొలిసారిగా భారతదేశంలో కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి లేక పోవడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates