ఆ ఇద్దరు సీఎంలకు మరో ఛాన్స్ ఉన్నట్టే!

దేశంలో హోరాహోరీగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముగిసింది. బెంగాల్, తమిళనాడు, కేరళలలో ప్రభుత్వాలు మారిపోయాయి. ఈ మూడు రాష్ట్రాల్లో తొలి రెండు రాష్ట్రాల్లో సీఎంలుగా కొనసాగిన ఎంకే స్టాలిన్, మమత బెనర్జీలు సీఎం కుర్చీతో పాటు ఎమ్మెల్యే పదవులనూ కోల్పోయారు.

బెంగాల్ లో బీజేపీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన దీదీ మాజీ అనుచరుడు సువేందు అధికారి చేతిలో ఆమె ఓడిపోయారు. ఇక విజయ్ దళపతి నేతృత్వంలోని టీవీకే అభ్యర్థి చేతిలో స్టాలిన్ ఓడిపోయారు. అంటే వీరిద్దరూ ఇప్పుడు అసెంబ్లీలో కూడా లేకుండాపోయారన్నమాట. అయితే సీఎం అవకాశం ఎలాగూ లేదు గానీ… సభలో అడుగు పెట్టేందుకు వీరికి మరో ఛాన్స్ అయితే ఉందని చెప్పాలి.

దీదీ విషయానికి వస్తే… బెంగాల్ ను 15 ఏళ్ల పాటు పాలిస్తూ వచ్చిన దీదీ బెంగాలీ ఓటర్ల ఆగ్రహానికి గురయ్యారు. వ్యూహాత్మకంగా సాగిన బీజేపీ… బెంగాల్ లో దీదీ ప్రభంజనానికి చెక్ పెట్టి… తొలిసారి బంగాలీ గడ్డపై అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ క్రమంలో భవానీపురం అసెంబ్లీ నుంచి దీదీ పోటీ చేయగా…ఆమెకు పోటీగా సువేందు బరిలోకి దిగారు.

హోరాహోరీగా సాగిన పోలింగ్ లో చివరకు సువేందునే విజయం వరించగా… 15 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగిన దీదీ ఈ దఫా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. అయితే సువేందు రెండు స్థానాల్లో పోటీ చేసి రెండింటా విజయం సాధించారు. ఈ క్రమంలో ఆయన ఓ స్థానానికి రాజీనామా చేయక తప్పదు. ఆ తర్వాత జరగనున్న బైపోల్ లో సువేందు ఖాళీ చేసిన సీటు నుంచి దీదీ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం అయితే ఉంది.

ఇక స్టాలిన్ విషయానికి వస్తే… ఇప్పటికే మూడు పర్యాయాలు కొళత్తూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన స్టాలిన్ నాలుగోసారి కూడా అక్కడే బరిలోకి దిగారు. అయితే టీవీకే తరఫున బరిలోకి దిగిన వీఎస్ బాబు చేతిలో స్టాలిన్ ఓడిపోయారు. 8,700 పైచిలుకు ఓట్లతో బాబు గెలవగా.. సీఎం హోదాలో బరిలోకి దిగిన స్టాలిన్ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు.

ఇదిలా ఉంటే… పెరంబూర్, తిరుచురాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన టీవీకే విజయ్ రెండింటా విజయం సాధించారు. దీంతో ఆయన వీటిలో ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంది. అంటే… ఓ నియోజకవర్గానికి బైపోల్ ఖాయమన్న మాట. ఈ బైపోల్ లో డీఎంకే తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం స్టాలిన్ కు ఉందని చెప్పవచ్చు.

ఇలా ఇటు స్టాలిన్, అటు మమత బెనర్జీ ఇద్దరూ సీఎం కుర్చీలతో పాటు ఎమ్మెల్యే గిరీలనూ కోల్పోయినప్పటికీ.. ఎమ్మెల్యేగా గెలిచేందకు వారికి మరో అవకాశం అయితే ఉందని చెప్పాలి. ఒకవేళ వారు ఇగోలను పక్కనపెట్టి.. బైపోల్ లలో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిస్తే… వారి వారి రాష్ట్రాల్లో ప్రదాన ప్రతిపక్ష నేతలుగా కొనసాగే అవకాశం అయితే వారిద్దరికీ ఉంది. ప్రధాన ప్రతిపక్ష నేత అంటే… మంత్రి హోదా దక్కినట్టే కదా. మరి బైపోల్ పోటీకి వారిద్దరూ ఏమంటారన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.