విజ‌య్‌కు క‌లిసి వ‌చ్చిందేంటి?

త‌మిళ‌నాట ఎవ‌రి అంచ‌నాకు అంద‌ని విదంగా ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్ర‌స్తుత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌స‌ర‌మైన మెజారిటీ పైకొంత సందిగ్ధ‌త కొన‌సాగుతోంది. ప్ర‌స్తుత లెక్క‌ల ప్ర‌కారం.. విజ‌య్‌కు 108 స్థానాల్లో గెలిచారు. కానీ.. మెజారిటీ ద‌క్కించుకునేందుకు మ‌రో 10 స్థానాలు కావాల్సి ఉంటుంది. ఈ విష‌యం ఎలా ఉన్నా.. ఇప్పుడు విజ‌య్ విజ‌యం వెనుక ఏం జ‌రిగింది? అనేది ఆస‌క్తిగా మారింది.

నిజానికి విజ‌య్ ఉత్సాహం.. ఊపు.. వంటివి ముందు నుంచి అంచ‌నాలు పెంచాయి. ఆయ‌న ఖ‌చ్చితంగా అధికారం ద‌క్కించుకుంటున్నార‌న్న చ‌ర్చ కూడా తెర‌మీదికి వ‌చ్చింది. కానీ.. ఇంత‌లోనే కరూర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న పార్టీని వెంటాడింది. అదేస‌మ‌యంలో స‌తీమ‌ణి విడాకులు.. ఆ త‌ర్వాత రేగిన ర‌చ్చ‌.. వంటివి కూడా విజ‌య్‌ను మాన‌సికంగా ఇబ్బంది పెట్టాయి. అయిన‌ప్ప‌టికీ.. ఎక్క‌డా కుంగిపోకుండా.. విజ‌య్ దూకుడుగానే వ్య‌వ‌హ‌రించారు.

నిజానికి క‌రూర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న నేప‌థ్యంలో సీబీఐ విచార‌ణ‌కు ప‌లు మార్లు ఆయ‌న ఢిల్లీకి వెళ్లాల్సి వ‌చ్చింది. ఇది కూడా ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలోనే కావ‌డం గ‌మ‌నార్హం. ఫ‌లితంగా ఆయ‌న‌ను మాన‌సికంగా ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నాలు కూడా జ‌రిగాయి. అయిన‌ప్ప‌టికీ.. త‌మిళ‌నాట ప్ర‌జ‌లు విజ‌య్ వెంట ఉండ‌డానికి బ‌ల‌మైన నాలుగు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. వాటి వ‌ల్లే త‌మిళులు విజయ్‌కు బాస‌ట‌గా ఉన్నార‌ని తెలుస్తోంది.

1) యువ‌కుడు కావ‌డం: విజ‌య్ ప్ర‌స్తుత త‌రానికి ఐకాన్‌గా నిలిచారు. వాస్త‌వానికి ఆయ‌న వ‌య‌సు 51 ఏళ్లు. అయినా అలా క‌నిపించ‌రు. దీంతో యువ‌త ఎక్కువ‌గా విజ‌య్ వైపు మొగ్గు చూప‌డం క‌లిసి వ‌చ్చింది.

2) క్రిస్టియానిటీ : త‌మిళ‌నాడులో ఇప్ప‌టి వ‌ర‌కు క్రిస్టియానిటీకి సంబంధించి ప్రాతినిధ్యం వ‌హించిన పార్టీ లేదు. తొలిసారి టీవీకే క్రిస్టియానిటీ గ‌ళం అందుకుంది. ప్ర‌చారాల స‌మ‌యంలోనూ విజ‌య్ ప్రార్థ‌న‌లు చేశారు. అలాగే హిందూ, ముస్లిం ఆచారాలకు కూడా ఆయన ఎంతో గౌరవం ఇచ్చారు.

3) విశ్వాసం: కొత్త‌పార్టీని త‌మిళులు ఆద‌రించ‌డం.. చాలా క‌ష్టంతో కూడిన‌ప‌ని. గ‌తంలో విశ్వ‌న‌టుడు.. క‌మ‌ల్ హాస‌ప‌న్ పార్టీ పెట్టినా.. అది విజ‌యం ద‌క్కించుకోలేదు. కానీ, విజ‌య్ ఆ విశ్వాసాన్ని చూర‌గొన్నారు.

4) మార్పు దిశ‌గా: కేంద్రంపై పోరు విష‌యంలో డీఎంకే చేతులు ఎత్తేసింద‌న్న వాద‌న‌ను బ‌లంగా తీసుకువెళ్ల‌డంలో విజ‌య్ ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొన్నారు. బీజేపీకి వ్య‌తిరేకంగా గ‌ళం వినిపిస్తార‌న్న వాద‌న‌ను ప్ర‌జ‌లు న‌మ్మేలా చేశారు. మార్పుకోసం వేయాల‌న్న ఓటు నినాదం ఫ‌లించింది.