పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024 ఎన్నిక‌ల్లో 74 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకున్నారు. గ‌తంలో అంటే. 2019లో రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీచేసినా.. ఆయ‌న ప‌రాజ‌యం పాల‌య్యారు. ఈ క్రమంలో కాపు సామాజిక వ‌ర్గం అధికంగా ఉన్న పిఠాపురాన్ని ఎంచుకుని మ‌రీ పోటీ చేసిన గెలుపు గుర్రం ఎక్కారు.

అయితే.. ఆయ‌న గెలిచి.. రెండు సంవ‌త్స‌రాలు అయిన‌నేప‌థ్యంలో త‌న నియోజ‌క‌వ‌ర్గంలో తానేం చేశానో చెబుతూ.. సుదీర్ఘ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. నేనొచ్చాక పిఠాపురంలో ఏం చేశానంటే.. అని పేర్కొంటూ ఆయా ప‌నుల‌ను ఆయ‌న వివ‌రించారు. నిజానికి ఏ నియోజ‌క‌వ‌ర్గానికైనా.. రెండేళ్ల స‌మ‌యం అంటే త‌క్కువ‌నే చెప్పాలి. అయిన‌ప్ప‌టికీ.. నియోజ‌క‌వ‌ర్గంలో భారీ ఎత్తున అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టారు.

ఐదేళ్ల స‌మ‌యం ఉన్నా.. వైసీపీ హ‌యాంలో అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నీసం రోడ్ల‌పై గుంత‌లు కూడా పూడ్చ‌లేదు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ఇప్పుడు చ‌ర్చ‌కు దారి తీసింది. ప్ర‌ధానంగా కేంద్రం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను విరివిగా వినియోగించుకుని రాష్ట్ర ప్ర‌భుత్వంపై పెద్ద‌గా భారం ప‌డ‌కుండానే ఆయా ప‌నులు పూర్తి చేయ‌డం విశేషం.

ఇవీ కీల‌క అభివృద్ధి ప‌నులు..

1) కేంద్రం అమలు చేస్తున్న అమృత్‌భారత్‌ పథకాన్ని వినియోగించుకుని 37 కోట్ల 25 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో పిఠాపురం రైల్వేస్టేషన్‌ను స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దారు.

2) కీల‌క‌మైన పిఠాపురం ఆర్టీసీ బస్టాండులో ప్ర‌యాణికుల సౌక‌ర్యాలు మెరుగు ప‌రిచారు. బ‌స్సుల సంఖ్య‌ను కూడా పెంచారు.

3) పిఠాపురం మున్సిపాలిటీని సెలక్షన్‌ గ్రేడ్‌ స్థాయికి పెంచారు.

4) గొల్లప్రోలు నగర పంచాయతీని గ్రేడ్‌-3 మున్సిపాలిటీగా మార్పు చేశారు.

5) కొన్ని ద‌శాబ్దాలుగా కొబ్బ‌రి రైతులు ఎదురు చూస్తున్న‌ ఉప్పాడ స‌ముద్ర‌ తీరంలో కోత నివారణకు 323 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి.. రక్షణ గోడ నిర్మించేందుకు కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేశారు. త్వ‌ర‌లోనే ఈ ప‌నులు ప్రారంభం కానున్నాయి.

6) 34 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి.. కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా మార్పు చేశారు. త‌ద్వారా ప్ర‌జ‌ల‌కు మ‌రిన్ని సేవ‌లు అంద‌నున్నాయి.

7) 234 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి.. 400ల‌కు పైగా రోడ్ల‌ను నిర్మిస్తున్నారు. వీటిలో రాష్ట్ర స్థాయి ర‌హ‌దారుల‌తో పాటు అంత‌ర్గత ర‌హ‌దారులు కూడా ఉన్నాయి.

8) రాష్ట్ర వ్యాప్తంగా అమ‌ల‌వుతున్న కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కం జలజీవన్‌ మిషన్‌ను పిఠాపురంలోనూ అమ‌లు చేసి.. 376 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నారు. త‌ద్వారా నియోజ‌క‌వ‌ర్గంలో నీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తున్నారు.

9) యువ‌త‌కు స్వ‌యం ఉపాధి క‌ల్పించే ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. దీనికి 10 కోట్ల రూపాయ‌లు సుమారు ఖ‌ర్చు చేస్తున్నారు.

10) ఇప్ప‌టి వ‌ర‌కు ప్రైవేటు కంపెనీల్లో 487 మందికి ఉద్యోగం క‌ల్పించారు. అంతేకాదు.. స్కిల్‌హబ్ ద్వారా నియోజ‌వ‌ర్గంలోని యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు.

11) కోటి రూపాయ‌లు ఖ‌ర్చు చేసి.. క్రీడాకారుల‌కు అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నారు.

12) ఉప్పాడలో స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ఏర్పాటు చేసి యువ‌త‌కు శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు.

13) గ్రీన్‌ అల్యూమినియం స్మెల్టర్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయ‌డం ద్వారా.. పారిశ్రామికంగా పిఠాపురం డెవ‌ల‌ప్ కానుంది.

14) నియోజ‌క‌వ‌ర్గంలోని హిందూ దేవాల‌యాల‌ను అభివృద్ధి చేసేందుకు 20 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించారు.