టీడీపీతో రాజకీయం మొదలుపెట్టి…ఆపై బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ ఫుల్ రాజకీయవేత్తగా ఎదిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే మరోమారు పార్టీ మారబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. తన రాజకీయ వారసత్వం కోసం ఈ దఫా ఆయన బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మల్లారెడ్డి పార్టీ మారడం లేదని స్వయంగా ఆయన కోడలు ప్రీతిరెడ్డి శుక్రవారం తేల్చిపారేశారు. శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ కార్యలయానికి వెళ్లిన ప్రీతి రెడ్డి.. అక్కడ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ను కలిశారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తామేమీ పార్టీ మారబోవడం లేదని ప్రీతిరెడ్డి వెల్లడించారు. ఓ కీలకమైన కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రప్పించే దిశగా తమ కుటుంబం యత్నిస్తోందని, అందులో భాగంగానే తాము అటు మోదీతో పాటుగా ఇటు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ప్రముఖులను కలుస్తున్నామని ఆమె వివరించారు. తన మామ మల్లారెడ్డి బీఆర్ఎస్ లోనే ఉంటారని ఆమె చెప్పారు. తాము పార్టీ మారే ప్రసక్తే లేదని కూడా ఆమె వెల్లడించారు.
మల్లారెడ్డి ఫ్యామిలీ త్వరలోనే సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్పంచుకునేలా మల్లారెడ్డి ఫ్యామిలీ యత్నిస్తోంది. అందులో భాగంగానే ఇటీవలే తన కుటుంబ సభ్యులతో కలిసి మోదీని కలిశారు. తాజాగా ఆయన కోడలు ప్రీతిరెడ్డి నేరుగా బీజేపీ కార్యాలయానికి వెళ్లి పార్టీకి చెందిన కీలక నేతలతో భేటీ అయ్యారు.
తాను కేంద్ర మంత్రి బండి సంజయ్ తో టచ్ లో ఉన్నానని చెప్పిన ప్రీతి రెడ్డి…ఇటీవలే బీజేపీ తెలంగాణ చీప్ రాంచందర్ రావునూ కలిశారు. ఇలా వరుసబెట్టి మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీ నేతలను కలుస్తుండటంతో ఆ ఫ్యామిలీ బీజేపీలో చేరుతుందా? అన్న దిశగా విశ్లేషణలు సాగాయి. అయితే ప్రీతిరెడ్డి తాజాగా వాటికి చెక్ పెట్టారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates