100 కోట్ల తేడా.. పోలింగ్‌కు ముందు విజ‌య్‌కు చిక్కులు!

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో ఒంట‌రి పోరుకు రెడీ అయిన‌.. ద‌ళ‌ప‌తి విజ‌య్‌కు ఆదిలోనే చిక్కులు ఎదుర‌వుతున్నాయి. ఒక‌వైపు స‌తీమ‌ణి విడాకుల కేసు విచార‌ణ కొన‌సాగుతుండ‌గా.. మ‌రోవైపు క‌రూర్ తొక్కిస‌లాట దుర్ఘ‌ట‌న కేసు కూడా.. ముమ్మ‌రంగా ద‌ర్యాప్తు సాగుతోంది. ఇదిలావుంటే.. తాజాగా విజ‌య్ స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ల‌లో తేడా ఉంద‌ని పేర్కొంటూ.. మ‌ద్రాస్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. దాదాపు 100 కోట్ల రూపాయ‌ల‌కు పైగానే లెక్క‌లు తేడా చూపించార‌ని.. చెన్నైకి చెందిన విఘ్నేశ‌న్ అనే వ్య‌క్తి హైకోర్టులో ఈ కేసు దాఖ‌లు చేశారు. దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించిన న్యాయ‌స్థానం.. విజ‌య్‌కు నోటీసులు పంపించింది.

ఏం జ‌రిగింది?

త‌మిళ వెట్రి క‌ళ‌గం(టీవీకే) పార్టీని స్థాపించిన విజ‌య్‌.. తాజా ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే బ‌రిలోకి దిగారు. 234 స్థానాల్లోనూ అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టారు. తాను స్వ‌యంగా రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఇక‌, టీవీకే త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన ముగ్గురు అభ్య‌ర్థుల అఫిడ‌విట్లు కూడా.. ర‌ద్ద‌య్యాయి. దీంతో ఆయా చోట్ల ఇండిపెండెంట్ల‌కు టీవీకే త‌ర‌ఫున మ‌ద్ద‌తు ఇస్తున్నామ‌ని విజ‌య్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. మొత్తంగా.. 229 స్థానాల్లోనే ఇప్పుడు టీవీకే పోటీ చేస్తున్న‌ట్టు అయింది. అయితే.. వీటిలో రెండు చోట్ల‌.. 1) తిరుచ్చి. 2) పెరుంబూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌య్ త‌ల‌ప‌డుతున్నారు. ఇవి రెండు కూడా డీఎంకేకు కంచుకోట‌లుగా ఉన్నాయి.

అయితే.. ఈ రెండు స్థానాల్లో పోటీ సంద‌ర్భంగా విజ‌య్ స‌మ‌ర్పించిన నామినేష‌న్లు.. అఫిడ‌విట్ల‌ను ప‌రిశీలిస్తే.. ఆస్తుల విష‌యంలో 100 కోట్ల రూపాయ‌ల‌కు పైగానే తేడా వ‌చ్చిన‌ట్టు అధికారులు సైతం గుర్తించారు. దీనిపై ఎన్నిక‌ల సంఘం ఇప్ప‌టికే వివ‌ర‌ణ కోరింది. ఇది పెండింగులో ఉండ‌గా.. మ‌రోవైపు, విఘ్నేశ‌న్ అనే వ్య‌క్తి హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిని తేల్చాల‌ని.. పోలింగ్‌కు ముందే.. రెండు చోట్ల కూడా విజ‌య్‌ను పోటీకి అన‌ర్హుడుగా ప్ర‌క‌టించాల‌ని ఆయ‌న కోర్టును కోరారు. అయితే.. ఈ వాద‌న‌ను కోర్టు తోసిపుచ్చింది. తొలుత విజ‌య్ వివ‌ర‌ణ‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌ని పేర్కొంది.

ఏంటి తేడా?

1) పెరంబూర్‌లో సమర్పించిన అఫిడవిట్‌లో విజ‌య్ త‌న‌ ఆస్తులను 115 కోట్ల రూపాయ‌లుగా పేర్కొన్నారు.

2) తిరుచ్చి నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో త‌న ఆస్తుల‌ను 220 కోట్ల రూపాయ‌లుగా విజ‌య్ స్ప‌ష్టం చేశారు. ఇదే ఇప్పుడు వివాదానికి దారి తీసింది. అయితే.. మ‌రో రెండు రోజుల్లోనే పోలింగ్ ఉన్న నేప‌థ్యంలో విజ‌య్ నామినేష‌న్ల‌ను ర‌ద్దు చేయ‌డం సాధ్యం కాద‌ని.. స్క్రూటినీ జ‌రిగిపోయింద‌ని ఎన్నిక‌ల అధికారులు చెప్పారు. ఈ ప‌రిణామంపై హైకోర్టు ఎలాంటి ఉత్త‌ర్వులు జారీ చేస్తుంద‌న్న‌ది చూడాలి.